అమరావతి : ఈ ఎంపీపై అనుమానాలు పెరిగిపోతున్నాయా ?

Vijaya






ఎక్కడో స్వచ్చేస్తే ఇంకెక్కడో బల్బు వెలిగినట్లుగా ఢిల్లీలో జరిగిన ఘటనపై విజయవాడలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే బీజేపీ తరపున ఏపీ ఇన్చార్జి సునీల్ ధియోధర్ అనే ఒక నేతున్నారు. ఈయన రెగ్యులర్ గా ఏపీలో పర్యటించి వైసీపీ ప్రభుత్వంతో పాటు టీడీపీని కూడా నోటికొచ్చినట్లు విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు. ఈయన ఎలాంటి ఆరోపణలుచేసినా, విమర్శలు చేసినా రెండు పార్టీల నుండి ఎలాంటి రియాక్షన్ ఉండదు.



ఇలాంటి సునీల్ ఢిల్లీలో తనింట్లో గణేష్ చతుర్ధి పూజ నిర్వహించారు. ఈ పూజకు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు టీడీపీ విజయవాడ లోక్ సభ మెంబర్ కేశినేని నాని హాజరయ్యారు. పూజలో పాల్గొన్న విషయంలో వైసీపీలో  విజయసాయిరెడ్డి పై ఎలాంటి చర్చలు జరగటంలేదు. ఏదో పూజకు పిలిచారు విజయసాయి వెళ్ళారని మాత్రమే చెప్పుకున్నారు. కానీ టీడీపీలో మాత్రం కేశినేనిపై బాగా ప్రచారం జరుగుతోంది.




తొందరలోనే కేశినేని టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నట్లుగా ప్రచారం పెరిగిపోతోంది. గతంలో జరిగిన ఘటనలను కూడా ఇపుడు గుర్తుచేసుకుంటున్నారు. విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడుతో ఈ ఎంపీకి బాగా గ్యాప్ వచ్చేసింది. తనిష్టం ఉంటే ఎంపీ పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు లేకపోతే లేదంతే. ఒకసారి చంద్రబాబుతో భేటీ సందర్భంగా తాను టీడీపీ తరపున గెలిచినంతమాత్రాన టీడీపీకి మాత్రమే ఎంపీగా ఉండలేనని చెప్పారట. అలాగే ఇంకో సందర్భంగా మీఇంటికి మా ఇల్లు ఎంతదూరమో మా ఇంటికి మీ ఇల్లూ అంతే దూరమని కూడా చెప్పారట.




ఇది సరిపోదన్నట్లుగా తన ఆపీసుముందున్న ఫ్లెక్సీల్లో చంద్రబాబు, లోకేష్ ఫొటోలన్నింటినీ తీయించేశారు. దాంతో ఎంపీ ఏదోరోజు టీడీపీకి రాజీనామా చేసేయటం ఖాయమని పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఇలాంటి నేపధ్యంలోనే సునీల్ ఇంట్లో పూజకు కేశినేని హాజరవ్వటం అనుమానాలను పెంచేస్తున్నాయి. ఏదో పూజకు పిలిచారు హాజరయ్యారని ఊరుకోకుండా ఎంపీ తొందరలోనే బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం పెంచేయటం ఏంటో అర్ధం కావటంలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: