తెలంగాణ: ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత సేవలు?

Purushottham Vinay
ఇక టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత సేవలు అందుబాటులోకి తెచ్చింది. కరీంనగర్‌ రీజియన్‌లో దూరప్రాంత బస్సు సర్వీసుల్లో ఇవి అమలు చేస్తున్నారు.టికెట్ల జారీని మరింత సలుభతరం చేసేందుకు ఇప్పటికే టిమ్‌ (టికెట్‌ ఇష్యూ మిషన్‌) సేవలను అందిస్తుండగా తాజాగా ఐ-టిమ్‌ (ఇంటెలిజెంట్‌ టికెట్‌ ఇష్యూ మిషన్‌)ల ద్వారా బస్సుల్లో నగదు రహిత టికెట్‌ కొనుగోలు అందుబాటులోకి తెచ్చింది. డెబిట్, క్రెడిట్‌ కార్డులతో స్వైపింగ్, క్యూఆర్‌ కోడ్‌తో టికెట్లు కొనుగోలు చేసే సదుపాయం కల్పించారు. ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌లో అమలు చేస్తుండగా తాజాగా కరీంనగర్‌ రీజియన్‌లో ప్రయోగత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 928 ఐ-టిమ్ములు కొనుగోలు చేయగా కరీంనగర్‌ రీజియన్‌లో 10 డిపోలకు కలిపి 73 ఐ-టిమ్ములు, 36 సిమ్ములు వచ్చాయి. గరుడ, గరుడ ప్లస్, రాజధాని, హైటెక్, సూపర్‌లగ్జరీ (కొన్నింటిలో) బస్సు సర్వీసుల్లో క్యాష్‌లెస్‌ సేవలు అందించాలని నిర్ణయించారు. ప్రస్తుతం మంథని నుంచి ధర్మవరం (ఆంధ్రప్రదేశ్‌), కరీంనగర్‌-1 డిపో నుంచి బెంగళూర్‌(గరుడ), జగిత్యాల, కోరుట్ల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం (ఇంద్ర), కరీంనగర్‌-2 నుంచి హైదరాబాద్‌ (హైటెక్‌) బస్సు సర్వీసులతో పాటు మరికొన్ని దూర ప్రాంత సర్వీసుల్లో నగదు రహిత టికెట్లు ఇస్తున్నారు. దశల వారీగా అన్ని సర్వీసుల్లో అందుబాటులోకి తేనున్నారు.


అలాగే ఐ-టిమ్ములను ఉపయోగించే విధానంపై ప్రతి డిపో నుంచి సిస్టం సూపర్‌వైజర్లకు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. అక్కడ తర్ఫీదు పొందిన అధికారులు డ్రైవర్లు ఇంకా కండక్టర్లకు నేర్పించారు. ప్రస్తుతం ఆయా డిపోలకు వచ్చిన ఐ-టిమ్ముల్లో సాఫ్ట్‌వేర్‌ను వేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. నాలుగు నెలల్లో రిజర్వేషన్‌ సౌకర్యం ఉన్న అన్ని బస్సుల్లో సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.ఈ ఐ-టిమ్ములకు తప్పనిసరిగా ఇంటర్‌నెట్‌ ఉండాలి. అన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో ఉండవు. టిమ్ములు పని చేయవు. దీనిని అధిగమించడానికి ఐ-టిమ్ములో రెండు సిమ్ములను వేస్తున్నారు. ఏదో ఒక నెట్‌వర్క్‌ పనిచేసే అవకాశం ఉంటుంది.ఇంకా ఆర్టీసీలో నూతనంగా ప్రవేశపెట్టిన ఐ-టిమ్ముల ద్వారా సంస్థకు, ఇటు ..ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. బస్సులో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, సీట్ల నంబర్‌తో సహా తెలుసుకోవడానికి వీలుంటుంది. కరీంనగర్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సుల్లో ప్రయాణికుడు టికెట్‌ రిజర్వు చేసుకుంటే వెంటనే అది టిమ్ము తెరపై పడుతుంది. ప్రయాణికులు ఆ బస్సుల్లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలుస్తుంది. రీజియన్‌లో కొన్ని డిపోల్లో ప్రయోగాత్మకంగా క్యాష్‌లెస్‌ సేవలు అందుబాటులోకి తెచ్చామని కరీంనగర్‌ రీజియన్‌ ఆర్‌ఎం ఖుస్రోషాఖాన్‌ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: