హైదరాబాద్ : కేసీయార్ కే చుక్కలు కనబడుతున్నాయా ?

Vijaya






ప్రత్యర్ధులు రెచ్చిపోతుంటే ఎవరికైనా చుక్కలు కనబడటం మామూలే. కానీ సొంతపార్టీ నేతలే అధినేతకు చుక్కలు చూపిస్తుంటే ఇక ప్రత్యర్ధులతో ఏమి పోటీచేయగలరు ? మునుగోడు ఉపఎన్నిక విషయంలో అచ్చంగా కేసీయార్ పరిస్ధితి ఇపుడిలాగే తయారైంది. సొంతపార్టీ నేతలే కేసీయార్ కు చుక్కలు చూపిస్తున్నారు. పార్టీ తరపున పోటీచేయబోయే అభ్యర్ధి విషయంలో కేసీయార్ నిర్ణయంతో నియోజకవర్గంలోని నేతల్లో అత్యధికులు విభేదిస్తున్నారు.



ఇంతకీ విషయం ఏమిటంటే ఉపఎన్నికలో కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని పోటీచేయించాలనేది కేసీయార్ ఆలోచన. తన ఆలోచనను బహిరంగంగా ప్రకటించకుండా మంత్రితో చెప్పి నేతలను ఒప్పించాలని ఆదేశించారు. మంత్రి జగదీశ్వరరెడ్డి ఎంత ప్రయత్నించినా నేతలెవరు ఒప్పుకోలేదు. చివరకు కేసీయారే రంగంలోకి దిగి నేతలందరితోను చాలాసేపు మాట్లాడారు. అయితే ఎవరు కేసీయార్ నిర్ణయానికి సానుకూలంగా మాట్లాడలేదు.



చివరకు కేసీయార్ మాట్లాడుతు పార్టీ నిర్ణయించబోయే అభ్యర్ధికి అందరు మద్దతుగా పనిచేయాల్సిందే అన్నట్లు చెప్పి గురువారం రాత్రి  సమావేశాన్ని ముగించేశారు. అయితే కేసీయార్ ఊహించని డెవలప్మెంట్ శుక్రవారం ఉదయం జరిగింది. దాంతో కేసీయార్ కు పెద్ద షాక్ కొట్టినట్లయ్యింది. ఇంతకీ ఆ డెవలప్మెంట్ ఏమిటంటే ఆంధోల్ మైసమ్మ దేవాలయం దగ్గరలోని ఒక ఫంక్షన్ హాలులో సమావేశమయ్యారు. నేతలు సమావేశం అవుతున్నట్లు పార్టీలోని చాలామందికి తెలియకపోవటమే విచిత్రం. సమావేశమైన నేతలంతా ప్రభాకరరెడ్డి అభ్యర్ధిత్వాన్ని వ్యతరేకిస్తు తీర్మానంచేశారు.



స్వయంగా తాను ఎంపికచేసిన అభ్యర్ధినే నేతలంతా వ్యతిరేకిస్తుంటే ఏమిచేయాలో కేసీయార్ కు అర్ధం కావటంలేదు. సమావేశమైన నేతల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మార్కెట్ యార్డ్ కమిటీల ఛైర్మన్లు, కొందర సర్పంచులు కూడా ఉన్నారు. అంటే క్షేత్రస్ధాయిలో అభ్యర్ధి విజయానికి పనిచేయాల్సిన వాళ్ళంతా కూసుకుంట్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బయటపడింది. ఇంతమందిని కాదని కేసీయార్ తనిష్టం వచ్చిన అభ్యర్ధినే పోటీలోకి దింపితే రేపటి పరిస్ధితి ఏమిటో అర్ధం కావటంలేదు. తన నిర్ణయాన్ని కాదని అందరు పార్టీకి రాజీనామాలు చేస్తే కేసీయార్ ఏమిచేయగలరు ? మొత్తానికి ప్రత్యర్ధుల సంగతేమిటో తెలీదు కానీ ఇప్పటికైతే సొంతపార్టీ నేతలే కేసీయార్ కు చుక్కలు చూపిస్తున్నారన్నది వాస్తవం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: