అమరావతి : పవన్ గట్టిగా ఇరుక్కుపోయారా ?
బీజేపీ కౌగిలిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాగా ఇరుక్కుపోయారు. కౌగిలిలో ఉండలేకపోతున్నారు ఇదే సమయంలో కౌగిలినుండి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా సాధ్యంకావటంలేదు. అసలు బీజేపీ వైఖరి ఎవరికీ అర్ధంకావటంలేదు. ప్రత్యర్ధులను ఎలాగూ చీల్చిచెండాడేస్తోంది. ఇదే సమయంలో మిత్రపక్షాలను కూడా రాచిరంపాన పెడుతోంది. దాంతో బీజేపీకి ఎవరు ప్రత్యర్ధులో ఎవరు మిత్రులో కూడా ఎవరికీ అర్ధంకావటంలేదు.
ఇందుకు తాజా ఉదాహరణ బీహార్లో జేడీయూనే చెప్పచ్చు. అవటానికి మిత్రపక్షమే అయినా జేడీయూ ఎంఎల్ఏలు, ఎంపీలతో బీజేపీ అగ్రనేతలు రెగ్యులర్ గా టచ్ లో ఉండటాన్ని ఎవరైనా ఎలాచూస్తారు ? ఇపుడు పవన్ పరిస్ధితి కూడా దాదాపు ఇలాగే తయారైంది. బీజేపీ మిత్రపక్షంగా కంటిన్యు అవలేకున్నారు. పోనీ బీజేపీని వదిలేద్దామా అంటే సాధ్యం కావటంలేదు. బీజేపీని థిక్కరించి బయటకు వెళ్ళిన పార్టీల్లోని నేతల పరిస్ధితి ఏమవుతున్నదో అందరు చూస్తున్నదే.
బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నంతవరకు సుజనాచౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళు ఏమిచేసినా చెల్లిపోయింది. ఎప్పుడైతే బీజేపీతో టీడీపీకి చెడిపోయి విడిపోయిందో వెంటనే సుజనా, రమేష్ పై ఈడీ, సీఐడీ, ఐటి శాఖలు దాడులుచేసి కేసులు పెట్టాయి. విచారణపేరుతో ఎన్నిసార్లు పిలిపించుకున్నాయో లెక్కేలేదు. దాంతో లాభంలేదని 2019 ఎన్నికల తర్వాత వీళ్ళు బీజేపీలో చేరిపోగానే పరిశుద్ధాత్ములైపోయారు. మళ్ళీ దర్యాప్తు సంస్ధ కూడా వీళ్ళజోలికి వెళ్ళలేదు. రేపు పవన్ పరిస్ధితి కూడా ఇంతకన్నా మెరుగ్గా ఏమీ ఉండదు.
పోనీ మిత్రపక్షంగా ఏమైనా మర్యాదిస్తున్నదా అంటే అదీలేదు. భీమవరంలో నరేంద్రమోడీ పాల్గొన్న బహిరంగసభకు పవన్ కు ఆహ్వానంలేదు. పైగా పార్టీ తరపున ప్రతినిధిని పంపమని నేరుగా పవన్ కే ఆహ్వానం పంపారు. ఇదే సమయంలో సోదరుడు చిరంజీవిని మాత్రం ప్రత్యేకంగా భీమవరం కార్యక్రమానికి పిలిపించుకున్నారు. మొన్ననే ఢిల్లీలో జరిగిన ఆజాదీకి అమృతోత్సవ్ కార్యక్రమానికి అసలు ఆహ్వానమే లేదు. ఇందుకే బీజేపీకి తాను మిత్రపక్షమా లేకపోతే ప్రత్యర్ధా అన్న విషయంలో బహుశా పవన్ కే క్లారిటి లేదేమో.