బాబు, పవన్, లోకేష్ పై అంబటి పంచ్ లు..

Deekshitha Reddy
విపక్షాలపై వైసీపీ మాటల దాడి ముమ్మరం చేసింది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసేందుకు వైసీపీ తరపున మంత్రి అంబటి రాంబాబు ఎప్పుడూ తాను సిద్ధం అంటున్నారు. తాజాగా ఆయన పవన్ పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు, పవన్, లోకేష్ పై తనదైన రీతిలో పంచ్ లు విసిరారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. వైసీపీ రాష్ట్ర ప్రీనరీలో చర్చించే అంశాలను కూడా అంబటి రాంబాబు వివరించారు. వైఎస్ఆర్ చేయలేని సంక్షేమ పనులు కూడా సీఎం జగన్ చేస్తున్నారని వివరించారు అంబటి. జగన్ ను ఓడించడం ఎవరి వల్ల కాదని అన్నారాయన. దుష్ట చతుష్టయం కలసి వచ్చినా జగన్ ను ఓడించలేరని చెబుతున్నారు మంత్రి అంబటి.
చంద్రబాబుని ఈసారి ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో కచ్చితంగా ఓడించి తీరతామన్నారు అంబటి. బాబు తన సొంత పుత్రుడు లోకేష్ తో కలసి వచ్చినా, దత్త పుత్రుడు పవన్ తో వచ్చినా.. వారందర్నీ కృష్ణానదిలో కలపడం ఖాయమని అన్నారు అంబటి. అందుకు వైసీపీ క్యాడర్ రెడీగా ఉందని చెప్పారు అంబటి రాంబాబు. చంద్రబాబు, పవన్ లు కలసి ఎన్ని కుట్రలు పన్నినా మళ్లీ జగన్ సీఎం అవుతారని, ఆయన్ను సీఎం కాకుండా అడ్డుకోవడం ఎవరి వల్లా కాదని అన్నారు అంబటి రాంబాబు.
పవన్ కి ఆ కోర్కె లేదు..
పవన్ కళ్యాణ్ కి ప్రస్తుతం సీఎం కావడం ఇష్టం లేదని, ఆయన కోరిక అంతా చంద్రబాబుని సీఎం చేయడమేనని చెప్పారు. అందుకోసం పవన్ తన కార్యకర్తలను వాడుకుంటున్నారని మండిపడ్డారు అంబటి. జనసేన కార్యకర్తలు కాస్త జాగరూకతతో ఉండాలని, పవన్ తీసుకునే నిర్ణయాలన్నీ చంద్రబాబు మేలుకోసమేనని చెప్పారు. ఇక వైసీపీ రాష్ట్ర ప్లీనరీలో చారిత్రాత్మక నిర్ణయాలు తీకుకోబోతున్నట్టు ప్రకటించారు అంబటి. ఇప్పటి వరకూ ఏపీలో లక్షా యాభై వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల ఖాతాల్లోకి వెళ్లాయని చెప్పారు అంబటి.
మహానాడు తర్వాత టీడీపీకి నోరు ఎక్కువైందని, ఆ పార్టీ నాయకులు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి అంబటి రాంబాబు. అయ్యన్న నోరు మరుగుదొడ్డి లా తయారైందని విమర్శించారు. చంద్రబాబు పచ్చి మోసాలు చేస్తూ రాజకీయాల్ోల ఉన్నారని, సొంత కుటుంబాన్నే మోసం చేసి సీఎం అయిన వ్యక్తి ఆయన అని చెప్పారు. వచ్చే ప్లీనరీతో ఏపీలో ఎన్నికల యుద్దభేరి మోగించబోతున్నాం అని చెప్పారు అంబటి రాంబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: