మహానాడులో లోకేష్ హవా ఎందుకు తగ్గింది..?

Deekshitha Reddy
ఒంగోలులో రెండురోజులపాటు జరిగే టీడీపీ మహానాడు కార్యక్రమానికి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ముందురోజు చంద్రబాబు మహానాడుకోసం మంగళగిరినుంచి బయలుదేరి ఒంగోలు చేరుకున్నారు. అడుగడుగునా ఆయనకు ఘన స్వాగతం పలికాయి టీడీపీ శ్రేణులు. మంగళగిరి నుంచి బయలుదేరిన ఆయనకు పట్టాభిపురం, పెదకాకాని, యడ్లపాడు వద్ద ఘన స్వాగతం పలికారు. మండుటెండలో సైతం చంద్రబాబుని చూసేందుకు జనం రోడ్లపైకి వచ్చి నిలబడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు చంద్రబాబు కోసం వేచి చూశారు, దారి పొడవునా ఆయనకు అభివాదం చేశారు. గ్రామాలలోకి చంద్రబాబు వాహనం రాగానే సందడి వాతావరణం కనిపించింది.
చంద్రబాబు వరకు అంతా బాగానే ఉంది కానీ,  ఈ సందడిలో నారా లోకేష్ మాత్రం కాస్త వెనక్కి తగ్గారు. ఒక్క మాటలో చెప్పాలంటే సందడి అంతా చంద్రబాబుదే. నారా లోకేష్ హవా పెద్దగా కనిపించట్లేదు. మహానాడులో కూడా చంద్రబాబు హవానే ఎక్కువగా ఉంది అని తెలుస్తోంది. తీర్మాానాలు, వాటిపై ప్రసంగాలు, భవిష్యత్ కార్యాచరణ.. అంతా చంద్రబాబు కేంద్రంగానే జరుగుతుంది.
భావి నాయకుడిని పట్టించుకోరా..?
చంద్రబాబు తర్వాత భావి నాయకుడిగా నారా లోకేష్ ని తెరపైకి తీసుకు రావాలని చూస్తోంది టీడీపీ. అయితే 2019 ఎన్నికల్లో నారా లోకేష్ కనీసం మంగళగిరిలో ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. ఆ తర్వాతయినా అక్కడ పార్టీ పరిస్థితి మెరుగుపడిందా అంటే చెప్పలేని పరిస్థితి. వయసు మీదపడుతున్నా చంద్రబాబు పార్టీ కోసం అహర్శిశం కష్టపడుతున్నారు. ఆ స్థాయిలో నారా లోకేష్ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటి వరకూ కష్టం అందా పెద్దాయనదే. చినబాబు పర్యటనలు చేస్తున్నా.. కార్యకర్తల్లో ఆ స్థాయిలో జోష్ నింపుతున్నారనే ప్రచారం లేదు. ఇప్పుడు మహానాడులో కూడా అంతా చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారు. నారా లోకేష్ ని భవిష్యత్ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు పార్టీ కూడా పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. ఈసారికి చంద్రబాబు మళ్లీ రావాలి అనే దిశలో ప్రచారం మొదలు పెట్టారు. మళ్లీ మీరే రావాలి అంటూ బ్యానర్లు కడుతున్నారు. లోకేష్ నాయకత్వం కావాలి, యువ నాయకత్వం రావాలి అనే మాట ఎక్కడా వినపడటంలేదు. బహుశా ఈసారి తానే కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చి, ఆ తర్వాత బాధ్యతలు లోకేష్ కి అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: