మంత్రి రోజా భర్త ఇలా మాట్లాడుతున్నారేంటి..?

Deekshitha Reddy
మంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత రోజా సంతోషానికి అవధుల్లేవు. జబర్దస్త్ తో కూడా ఆమె బంధాన్ని తెంచుకుంది. తన కుటుంబంతో సహా.. కీలక నేతలను, ఇతర ప్రముఖులను కలసి వస్తోంది. తన సంతోషాన్ని వారితో పంచుకుంటోంది. ఈ దశలో... రోజా భర్త తమిళ దర్శకుడు ఆర్కే సెల్వమణి చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణం అవుతున్నాయి. తమిళ సినిమాల షూటింగ్ ల గురించి సెల్వమణి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. ఏపీకి అన్యాయం చేసే విధంగా ఆయన మాట్లాడుతున్నారని అంటున్నారు.
ఇంతకీ సెల్వమణి ఏమన్నారు...?
తమిళ సినిమాల షూటింగ్ లన్నీ తమిళనాడులోనే జరగాలని అన్నారు తమిళ చలనచిత్ర కార్మికుల సంఘాల సమ్మేళనం (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి. ఈ వ్యాఖ్యలు ఇంకెవరైనా చేస్తే వాటికి పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ ఏపీ మంత్రి రోజా భర్త సెల్వమణి ఇలా మాట్లాడటం మాత్రం సంచలనంగా మారింది. చెన్నైలో విలేకర్ల సమావేశం నిర్వహించిన ఆయన.. సినిమా పరిశ్రమ సమస్యలపై గళమెత్తారు. తమిళ సినిమాలను హైదరాబాద్‌, విశాఖ వంటి ప్రాంతాల్లో చిత్రీకరించడం సరికాదన్నారు. దాని వల్ల తమిళనాడులోని సినీ కార్మికులకు నష్టం కలుగుతుందని మండిపడ్డారు. ఇకపై స్టార్ హీరోలంతా తమ సినిమాల షూటింగ్ లు తమిళనాడులోనే పెట్టుకోవాలని సూచించారు. హీరోలంతా షూటింగ్ ల కోసం పొరుగు రాష్ట్రాలు వెళ్తుండే సరికి తమిళనాడులోని సినీ కార్మికులకు ఉపాధి లేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో హైదరాబాద్, విశాఖ అంటూ ప్రస్తావించడం వివాదానికి కారణం అయింది.
సెల్వమణి వ్యాఖ్యలపై రోజా స్పందించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో షూటింగ్ లు చేయవద్దని చెప్పడానికి సెల్వమణికి ఉన్న అధికారం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తానని రోజా చెబుతున్నారని, అదే సమయంలో ఆమె భర్త మాత్రం ఏపీలో సినిమా షూటింగ్ లు వద్దంటూ.. ఆమె మాటలకు విరుద్ధంగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. సెల్వమణి వ్యాఖ్యలకు రోజా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ నేతలు. మరి దీనిపై మంత్రి రోజా స్పందిస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: