మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లే...!
ప్రస్తుతం అధికార వైసీపీ నేతల్లో ఒకటే చర్చ. అసలు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా.. లేదా... అనేది. దీనికి ప్రధాన కారణం ప్రస్తుత మంత్రివర్గ గడువు ముగిసిపోవడమే. రెండున్నర ఏళ్లు గడిచినా కూడా పార్టీలో మంత్రివర్గ కూర్పుపై ఎలాంటి చర్చ జరగటం లేదు. గతంలో ఎప్పుడో నాలుగు నెలల క్రితం... సెప్టెంబర్ 16వ తేదీన జరిగిన కేబినెట్ భేటీలో మంత్రుల మార్పునకు వేళ అయ్యింది అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మాజీలకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని.. తాజా టీమ్ ఎన్నికల టీమ్ అని కూడా కామెంట్ చేశారు జగన్. దీంతో దసరా పండుగకు అవకాశం ఉంటుందని అంతా భావించారు. దసరా పోయింది. దీపావళి పండుగ సమయానికి దాదాపు ఖరారని భావించారు. అదే సమయంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించారు. ఇక శాసన మండలి ఖాళీల భర్తీ కూడా పూర్తి చేశారు జగన్. దీంతో... డిసెంబర్ మొదటి వారం లేదా జగన్ పుట్టిన రోజు నాటికి కొత్త మంత్రివర్గం కొలువు తీరుతుందని అంతా భావించారు. అదీ జరగలేదు. సంక్రాంతి నాటికి మంత్రులుగా ప్రమాణం చేస్తామని ఆశావహులు ఆశపడ్డారు. చివరికి ఆ పుణ్యకాలం కూడా పూర్తైంది. దీంతో అసలు ఉంటుందా.. ఉండదా అనే అనుమానం మొదలైంది.