బాబు ఆవేశపడ్డారు.... టీడీపీలో ఇదే హాట్ డిస్కర్షన్...!
ఇప్పుడు ఈ వ్యాఖ్యలపైనే టీడీపీ నేతలు అంతర్మథనం చెందుతున్నారు. ఎందుకంటే.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. సినిమా రంగంలో దాదాపు అందరూ.. టీడీపీ వెంటే నడిచారు. 2014 ఎన్నికలను తీసుకుంటే.. దీనికి ముందు.. వస్తున్నా మీకోసం .. అంటూ చంద్రబాబు యాత్ర చేపట్టారు. ఈ యాత్రకు అప్పట్లో నిర్మాత అశ్వనీదత్ పిలుపు మేరకు నిర్మాతల మండలి 25 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చింది. తర్వాత.. ప్రభుత్వం ఏర్పడ్డాక.. బోయపాటి శ్రీను నేతృత్వంలో రెండు పుష్కరాలకు ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది.
తర్వాత.. రాజధాని విషయంలో నిర్మాణాలకు దర్శకుడు రాజమౌళి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇక, తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు.. ప్రభుత్వానికి సాయం ప్రకటించిన హీరోలు, నిర్మాతలు అనేక మంది ఉన్నారు. అదేసమయంలో పార్టీ తరఫున అప్పట్లో ప్రచారం కూడా చేశారు. మరి ఇంత చేసిన సినిమా రంగంపై ఇప్పుడు చంద్రబాబు ఆవేశంతో కొన్ని మాటలు అనేశారు. వాస్తవానికి గతం కంటే కూడా ఇప్పుడు సినిమా రంగంలో చంద్రబాబు సీఎం కావాలని కోరుకునే వర్గాలు పెరిగాయి. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి.
ముఖ్యంగా రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టిన వర్గాలు సినీరంగంలోనూ ఉన్నాయి. అదేవిధంగా సినిమాటికెట్ల ధర, వినోదపు పన్ను తగ్గింపు.. ధియేటర్లపై దాడులు.. వంటివిషయాల్లో కూడా చంద్రబాబు అయితే బెటర్ అనుకునేవారు ఉన్నారు. అందుకే.. మళ్లీ ఆయనను సీఎంగా చూసేందుకు సినీరంగంలోనే కొందరు పెద్దలు.. గ్రూపుగా ఇటీవలే ఫామ్ అయ్యారని కూడా వార్తలు వచ్చాయి. ఈ సమయంలో చంద్రబాబు ఆవేశంతో చేసిన వ్యాఖ్యలు ప్రభావం చూపుతాయేమోనని.. పార్టీ నేతలు తల్లడిల్లుతుండడం గమనార్హం. మరి ఇది ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.