రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు ఇంకా దాదాపు రేండేళ్ల సమయం ఉన్నా రాజకీయ పార్టీలు అప్పుడే ఎన్నికల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సందించుకుంటూ పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. నువ్వా నేనా అన్నట్టు టీఆర్ఎస్, బీజేపీలు వ్యూహాలు రచిస్తూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ రెండు పార్టీల వైరం పెరగడానికి అసలు కారణం తెలంగాణలో బలపడడమే. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా దేశంలో బీజేపీని భూ స్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నాడు. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా బీజేపీ వ్యతిరేక ప్రతిపక్ష పార్టీల నేతలతో భేటీ అవుతున్నారు.
అయితే, ఈ రెండు పార్టీల టార్గెట్ ఓటర్ మాత్రమేనని స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేయాలని కాషాయ పార్టీ దృఢ నిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్ర పార్టీ నేతలు కేసీఆర్, టీఆర్ఎస్ టార్గెట్ గా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైన నేపథ్యంలో ఆ వ్యతిరేకతను తమకు సానుకూలంగా మలుచుకోవాలని కమలనాధులు భావిస్తున్నారు.
దీంట్లో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న బీజేపీ తెలంగాన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఆ పార్టీ అధిష్టానం ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. సపోర్ట్ ఇవ్వడమే కాకుండా బండి సంజయ్ చేపడుతున్న పోరాటానికి మద్ధతుగా రోజుకో జాతీయ నేతను దింపుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ.నడ్డా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలంగాణలో పర్యటించారు. దీంతో పాటు ప్రధాని మోడి స్వయంగా బండి సంజయ్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలో కేసీఆర్ కూడా సైలెంట్ గా బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసేందుకు పావులు కదపడంలో భాగంగానే వివిధ పార్టీల నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ రెండు పార్టీల తీరుతో రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. దీంతో అసలేం జరుగుతుందా అని ఓటర్లు ఉత్కంఠగా చూస్తున్నారు.