జగ జగ జగడం : మళ్లీ ఆంధ్రాతో తెలంగాణ తగువు? ఎందుకని?
గోదావరి నీటి వినియోగంపై మళ్లీ మరో రగడ నెలకొంది. ఇప్పటిదాకా ఇచ్చిన వివరాల్లో ఏవీ స్పష్టంగా లేవని ఏపీని ప్రశ్నిస్తూ తెలంగాణ నీటి వినియోగం పై మన అధికారులు చెప్పిన అభ్యంతరాలను మరోసారి సరి చూసుకోవాలని చెబుతూ కేంద్రం ఓ నోట్ పంపింది. దీనిపై ఇరు రాష్ట్రాలూ ఏమని స్పందిస్తాయో మరి! ఇప్పటికే తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రా అభ్యంతరాలున్నా కూడా వాటిని ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడాఅభ్యంతరాలు ఉంటూనే ఉన్నాయి.వీటిని కూడా పట్టించుకోకుండానే తాము అనుమతులు ఇచ్చామని కేంద్రం ఒప్పుకుంది. కానీ వివాదం పరిష్కారంలో ఏపీ చెబుతున్న మాటలకు మాత్రం అడ్డం చెబుతోంది.
ఆంధ్రా,తెలంగాణ మధ్య నీటి వివాదాలు ఇప్పట్లో తేలేలా లేవు.వీటిపై ఇరు రాష్ట్రాల ప్రతినిధులు ఎన్ని సార్లు మాట్లాడుకున్నా సమస్య మళ్లీ మొదటికే వచ్చింది. గోదావరి నీటి వినియోగానికి సంబంధించి ఇప్పుడు తాజా వివాదం నెలకొంది. మీరు ఇచ్చిన వివరాలేం బాలేవు అంటూ కేంద్ర జల వనరుల సంఘం కొర్రీలు పెడుతోంది.వీటిపై తెలంగాణ జోక్యం చేసుకుంటున్న తీరు కూడా అంతగా బాలేదు. అదే సమయంలో కేంద్రం కూడా! రాజకీయమే పరమావధిగా చేసుకుని ఉంటోంది! ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు కొట్లాడ పడినా కేంద్రం చోద్యం చూస్తుందే తప్ప వారినీ వీరినీ పిలిచి మాట్లాడిన సందర్భాలే లేవు.అందుకే నీటి వివాదాలు ఎప్పటికప్పుడు నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా వినియోగంకు సంబంధించే వివాదాలు ఉన్నాయి.. అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి అభ్యంతరాలూ అలానే ఉన్నాయి. వీటిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటే సమస్య కాస్తయినా పరిష్కారం అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. కానీ రాజకీయం తప్ప ప్రాంత ప్రయోజనాలు పట్టని ఆంధ్ర మరియు తెలంగాణ పెద్దలు ఎప్పటికప్పుడు ఏదో ఒక సందర్భంలో కలుసుకున్నా, కీలకం అయిన ఉమ్మడి అంశంగా పరిగణించే నీటి పంపకాలపై మాత్రం దృష్టి సారించక వాటిని తమ రాజకీయ లబ్ధి కోసం యథేచ్ఛగా వాడుకుంటున్నారన్న అభియోగం కూడా ఉంది.