జగన్ చివరి క్యాబినెట్ ముహుర్తం ఖరారు...!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటపై నమ్మకంతో... అప్పట్లో రోజా, ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణ రెడ్డి, మల్లాది విష్ణు, ఆళ్ల రామకృష్ణా రెడ్డి వంటి నేతలు సైలెంట్ అయ్యారు. ఇక మంత్రివర్గ మార్పుపై సెప్టెంబర్ 16వ తేదీన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో జగన్ క్లారిటీ కూడా ఇచ్చారు. ప్రస్తుత మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని... అలాగే కొత్త మంత్రివర్గం కూడా ఎలక్షన్ 2024 టీమ్ అని అభివర్ణించారు జగన్. దీంతో దసరా పండుగకు మంత్రివర్గ కూర్పు ఉంటుందని అంతా భావించారు. ఆ తర్వాత దీపావళి అన్నారు. ఆ తర్వాత శాసన మండలి ఎన్నికల తర్వాత ఉంటుందని సరిపెట్టుకున్నారు. ఇక సంక్రాంతి ముందు ఖాయమని... పెద్ద పండుగకు అందరు తమ అభిమానులతో అమాత్యుల హోదాతో గడిపేయవచ్చని ఆశ పడ్డారు. కానీ ఆ కల కూడా నెరవేరలేదు. ఇప్పుడు తాజాగా ఈ నెల 21వ తేదీన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇదే ఆఖరి సమావేశం అని అంతా భావిస్తున్నారు. ఆ తర్వాత కొత్త మంత్రులతో బడ్జెట్ సమావేశాలకు వెళ్లే అవకాశం ఉంటుందని గంపెడాశలతో ఉన్నారు.