కమలంపై కారు దూకుడు.. కాంగ్రెస్లో డైలమా..?
టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు కాషాయ పార్టీలు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ కూడా బీజేపీనే లక్ష్యంగా చేసుకోవడంతో.. వాళ్లు అనుకున్న లక్ష్యం కూడా నెరవేరుతున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ డైలమాలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ పై పోరాటానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నా.. ఆయనకు ప్రభుత్వం చెక్ పెట్టేందుకు రేవంత్ నిరసనలను అడ్డుకుంటోంది. రేవంత్ రెడ్డి ని ప్రభుత్వం అడ్డుకోవడంపై టీఆర్ఎస్ పై కాంగ్రెస్ పెద్దగా విమర్శించడం లేదు. కాంగ్రెస్లోనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం. అంతర్గత కలహాలతో సమయం గడుపుతుంటుంటే.. వచ్చే ఎన్నికల వేళ టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కోవడం అనే ఆ పార్టీ లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందనే విషయం ఆ పార్టీ శ్రేణులకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో టీఆర్ఎస్ను బీజేపీకి ధీటుగా ఎదుర్కోవాలంటే.. కాంగ్రెస్లోని నేతలందరూ ఒకతాటిపై రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేతలంతా ఐక్యంగా ముందుకొస్తేనే పార్టీ శ్రేణుల్లో నమ్మకం పెరుగుతుంది. పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసుకుని విపక్షాలను టార్గెట్ చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన నేతలు.. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడానికి పరిమితం అవడం చూస్తుంటే... తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే పరిస్థితి రావడానికి ఎంతో సమయం కూడా పట్టకపోవచ్చనే వాదన రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతోంది. తెలంగాణలో తాము బలపడాలంటే.. మరో విపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడాలని కాషాయ పార్టీ ఆశిస్తోంది.