తెలంగాణలో ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలహీనంగా మారుతోంది. పార్టీ విధానాలు పక్కన బెడితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం హస్తం పరిస్థితి తీవ్రంగా దిగజారింది. టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తరువాత కాంగ్రెస్ పట్టించుకునే వారే కరువయ్యారు. అయితే, రాజకీయ పరిణామాలతో కొంత పార్టీ పరిస్థితి దిగజారిపోతే.. పార్టీలో ఉన్న అంతర్గత కలహాలతో ప్రజల్లో మరింత చులకన అయింది. గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా హస్తంలో అదే కొనసాగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాకతో పార్టీ ముందుకు దూసుకుపోతుందని అందరూ అనుకున్నారు. కానీ, అది రివర్స్ అయి మరింత కలహాలకు దారితీస్తోంది.
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు మాత్రమే ఉన్నా.. పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే దానిపై దృష్టి సారించకుండా వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే, రేవంత్ టీపీసీసీ చీఫ్ పదవి చేపట్టిన అనంతర తీవ్ర వ్యతిరేక గళం వినిపించిన సీనియర్లు.. ఇటీవల కాస్త ఐక్యంగా ఉన్నట్టు కనిపించింది. కానీ, జగ్గారెడ్డి-రేవంత్ల వివాదంతో మరోసారి పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడం పక్కన బెట్టి మరింత పాతాలంలోకి వెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు రాష్ట్రంలో అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి మంచి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.
ఈ క్రమంలో పార్టీ సీనియర్లకు రేవంత్ రెడ్డి కి మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేసుకుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే రేవంత్ పై గుర్రుగా ఉన్న సీనియర్ నేతలు రేవంత్తో కలిసి నడిచే అవకాశాలు కష్టంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రేవంత్ రెడ్డి విజ్ఞప్తులకు సీనియర్ నేతలు అంగీకరిస్తే రాష్ట్రంలో పార్టీ బలపడుతుంది. ఇది సాధ్యం కాకుండా తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ముందు డీలా పడాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్రంలో మూడో స్థానానికి కాంగ్రెస్ దిగజారిపోవాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.