బాబోయ్ ఏపీలో ఇంత అప్పు ఉందా...!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నుంచి రుణం సేకరిస్తూనే ఉంది. పది జాతీయ బ్యాంకుల నుంచి ఇప్పటికే 57 వేల 479 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుగా తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇదే విషయాన్ని రాజ్యసభలో లిఖిత పూర్వకంగా వెల్లడించారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్. తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ఏపీలో ఉన్న 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు జాతీయ బ్యాంకులు నేరుగా రుణాలు మంజూరు చేశాయన్నారు. ఈ అప్పులకు సంబంధించిన అసలు, వడ్డీ చెల్లింపుల బాధ్యత కూడా ఆయా కార్పొరేషన్లు, కంపెనీలదే అని స్పష్టం చేశారు. ఈ అప్పుతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. 2019 సంవత్సరం నుంచి 2021 నవంబర్ వరకు ఒక్క భారతీయ స్టేట్ బ్యాంక్ నుంచి మాత్రమే 11 వేల 937 కోట్ల రూపాయలను జగన్ సర్కార్ రుణంగా తీసుకున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి.