జగన్‌పై ప్రశాంత్ కిషోర్‌ ఎఫెక్ట్..? ఏ రేంజ్‌లో..?

Chakravarthi Kalyan
ప్రశాంత్ కిషోర్‌.. ఇండియాలో ఎన్నికలను కూడా ఓ శాస్త్రంలా అధ్యయనం చేసిన వాడు.. ఎన్నికల్లో విజయాలను కూడా ప్రభావితం చేయగలిగిన వాడు.. దేశంలో తిమ్మిని బమ్మిని చేసే రాజకీయ నాయకులనే మాయ చేసిన వాడు.. ఎన్నికల వ్యూహకర్త అంటూ ఓ కొత్త ఉద్యోగాన్ని తానే క్రియేట్ చేసుకుని దాన్ని విజయవంతంగా నడుపుతున్నవాడు.. అసలు పార్టీలతో సంబంధం లేకుండా కేవలం తన పేరుతో దేశమంతటా పాపులారిటీ తెచ్చుకున్న తెలివైన వాడు.

అయితే.. సదరు ప్రశాంత్ కిషోర్‌కు తెలివితేటలు, ప్లానింగ్, అద్భుతమైన టీమ్‌ తో పాటు కాస్త అతి తెలివి కూడా ఎక్కువే అంటుంటారు ఆయన్ను గురించి తెలిసిన వారు. మొదట్లో మోడీ టీమ్‌లో పని చేసిన ప్రశాంత్ కిషోర్.. మోడీ అధికారంలోకి రావడంతో కాస్త ఫేమ్‌లోకి వచ్చాడు. మొదటి సారి దేశంలో ప్రశాంత్ కిషోర్ పేరు వినిపించింది. అయితే.. ఈ ప్రశాంత్ కిషోర్ బాగా పాపులర్ కావడానికి మాత్రం ఏపీ సీఎం జగనే కారణంగా చెప్పుకోవచ్చు. బీజేపీకి ప్రశాంత్ కిషోర్ తెర వెనుక ఉండి పని చేస్తే.. జగన్ ఏకంగా ఆయన్ను తెర ముందుకు తెచ్చాడు.

వైసీపీ పార్టీ సమావేశాల్లోనూ ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నాడు. ఆయన్ను బహిరంగంగా పార్టీ కార్యకర్తలకు పరిచయం చేశాడు.. గెలిచాక కూడా ప్రత్యేకంగా వెళ్లి ప్రశాంత్ కిషోర్‌ను కలిసి ఆనందం పంచుకున్నాడు. ఈ పరిణామాలతో ప్రశాంత్ కిషోర్‌ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత మమతా బెనర్జీతో కలసి పని చేసిన ప్రశాంత్ కిషోర్‌ బెంగాల్‌లో ఆమెను వరుసగా మూడో సారి గెలిపించి చరిత్రను తిరిగరాశాడు.. దీంతో ప్రశాంత్ కిషోర్‌ క్రేజ్ ఇంకాస్త పెరిగింది. అయితే ఈ వరుస విజయాలతో ప్రశాంత్‌ కిషోర్‌లో గర్వం కూడా అదేస్థాయిలో పెరిగిందని చెప్పొచ్చు.

ఇప్పుడు మమతతో కలసి పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్‌.. కాంగ్రెస్, బీజేపీలు కాకుండా మూడో ఫ్రంట్‌ కోసం పని చేస్తున్నాడు. మమత కేంద్రంగా ఈ మూడో ఫ్రంట్‌ను రూపొందించే ప్లాన్‌లో ఉన్నాడు. మరి ప్రశాంత్‌ కిషోర్‌ జగన్‌ను కూడా ఈ మూడో ఫ్రంట్‌లోకి లాగుతాడా.. మొదటి నుంచి ఎలాంటి కూటముల జోలికి పోని జగన్.. ఇప్పుడు మూడో ఫ్రంట్‌లోకి వెళ్తాడా.. జగన్‌ను ఆమేరకు ప్రశాంత్‌ కిషోర్‌ ప్రభావితం చేస్తాడా.. అన్నది ఆసక్తికరంగా మారింది. చూద్దాం.. ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: