ఆ ఇద్దరు `హస్తం`కు ఆయువు పోస్తారా..?
టీపీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి దక్కిన నాటి నుంచి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్ దూరంగా ఉంటూ వచ్చారు. తాను గాంధీ భవన్లోకి అడుగుపెట్టబోమని శపథం చేశారు. మాణిక్కం ఠాగూర్ డబ్బులకు అమ్ముడు పోయారని కూడా తీవ్ర వ్యాక్యలు చేశారు. వైఎస్ సంస్మరణ కార్యక్రమానికి హాజరు కావద్దని చెప్పినా వెళ్లి ప్రశంసలు కురిపించారు కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటమికి కాంగ్రెస్ నేతలే కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అయితే, తాజాగా వరి ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రెండు రోజుల దీక్షలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. రేవంత్ రెడ్డితో చేయి కలిపారు. ఇప్పుడుప్పుడే సీనియర్ నేతలు కలిసి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. ఐక్యంగా పని చేస్తామని కింది స్థాయి కార్యకర్తలకు సంకేతాలు పంపుతున్నారు. కానీ, ఇది ఎన్నాళ్లు కొనసాగుతుంది. రేవంత్ ఏ నిర్ణయాన్ని అయినా తీసుకుంటే దాన్ని సమర్థిస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక ఎన్నికల సమయానికి వచ్చే సరికి టికెట్ల గొడవ, ప్రచారం రగడ ఇవన్నీ కాంగ్రెస్లో ఎప్పటికీ ఉండేవే.
సీనియర్లు తమ ఆధిపత్యాన్ని పోగోట్టుకోవడానికి ఇష్టపడరు. ఇప్పటికే అనేక నియోజక వర్గాల్లో తమ వర్గానికి చెందిన వారిని ఇన్చార్జీలుగా నియమించాలని సీనియర్లు ఒత్తిడి తీసుకువస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో రానున్న కాలంలో విబేధాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ అనుమానాలను తప్పని నిరూపిస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఈ ఇద్దరి నేతల్లో ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.