ఎంత వద్దనుకున్నా కేసీఆర్ కూ బీజేపీకి మధ్య ఏదో గొడవ జరుగుతోంది. కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సినంత నిధులు ఇవ్వడం లేదా అలా అని నేరుగా అనలేక అడగలేక ధాన్యం కొనుగోలు అన్నది ఓ నెపమేనా అన్న డౌట్ కూడా వస్తోంది. ఇప్పటికే ధాన్యం కొనుగోలుపై బీజేపీ ఓ స్పష్టత ఇచ్చినా కేసీఆర్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. అంటే హుజురాబాద్ ఓటమిని అస్సలు గుర్తుకు కూడా రానివ్వకుండా ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఈ టైప్ పాలిటిక్స్ నడుపుతున్నారని అనుకోవాలా? ఎక్కడ చెడింది బీజేపీకీ, కేసీఆర్ కీ.. లేదా ఇదంతా ఓ పెద్ద అబద్ధమా.. డైవర్షన్ వల్ల లబ్ధి పొంది దళితబంధును మరిచిపోయేలా చేయొచ్చనా?
లేదా ముందస్తుకు వెళ్లనున్నారా?
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఓ వైపు జరుగుతున్నాయి. మురోవైపు ఇవాళ సీఎం కేసీఆర్ నేతృత్వాన క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ రెండు వేర్వేరు పరిణామాలులా కనిపించినా పైకి సంకేతించేవి ఒక్కటే. ఎప్పటి నుంచో బీజేపీకీ కేసీఆర్ కీ మధ్య గొడవ నలుగుతోంది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం తీసుకుంటున్న ఏ నిర్ణయం బాలేదని అంటున్నారు తెలంగాణ సీఎం. తాము అధికారంలోకి వచ్చాకే పంటలు పండుతున్నాయని, కరువు ఛాయలు తగ్గాయని పచ్చని సిరులతో సస్యశ్యామలం అవుతున్న గ్రామాలు ఎక్కువయ్యాయని అంటున్నారు. అంతా బాగుంది.. కేంద్రంతో ఎంతో దోస్తీ ఉన్న కేసీఆర్ సడెన్ గా ఎందుకు గేర్ మార్చారు.
హుజురాబాద్ ఎన్నికల తరువాత ఆయనలో ఏంటీ మార్పు. ప్రజలు తనను నమ్మడం లేదని అర్థం అయి ఈ నిర్ణయంకు వచ్చారా అన్న డౌట్ ఒకటి రాజకీయ పరిశీలకుల నుంచి వస్తోంది. సడెన్ గా అరవింద్ నో ఇంకొకరినో టార్గెట్ చేయకుండా కిషన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని? ఎందుకంటే ఈటెలకు ఆ రోజు బీజేపీలో చోటు ఇప్పించింది తరువాత క్రమంలో ఆయన ఎదిగేందుకు, విజేతగా నిలిచేందుకు సహకరించింది కిషన్ రెడ్డే! అందుకే ఆయన ఎక్కువగా కిషన్ రెడ్డిని టార్గెట్ గా ఎంచుకుంటున్నారు. మరోవైపు షర్మిలా రెడ్డి కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. మొన్న ఈటెల గెలుపునకూ రెడ్డి సామాజికవర్గమే ఏకం అయి ఓ కారణం అయింది. ఇవన్నీ మనసులో ఉంచుకుని కిషన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని వచ్చే ఎన్నికల్లో ఎదుగుదామని ప్రయత్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి విలన్ గా కిషన్ ను తెలంగాణ ప్రజల ముందుంచే ప్రయత్నం ఒకటి చేస్తూ తద్వారా కేసీఆర్ ఓ వెలుగు వెలిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వరుస వైఫల్యాలతో సతమతం అవుతున్న కేసీఆర్ కు ఇప్పుడు బీజేపీని లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఆ పార్టీ ఇక తెలంగాణలో ఆశించిన పురోగతి సాధించలేదు అనే భావనతో ఉన్నారు.