శ్రీకాకుళం రాజకీయాల్లో తిరుగులేని నేతగా పేరున్న ధర్మాన కృష్ణ దాసు మాట మార్చారు. వచ్చేఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పిన ఆయన ఉన్నపళంగా మాట మార్చి తాను జగనన్న ప్రోత్సాహంతో నరసన్నపేట నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తానని చెప్పి కొత్త ఆసక్తి ఒకటి తీసుకువచ్చారు. డిప్యూటీ సీఎం హోదాలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ధర్మాన కృష్ణదాసు చిర పరిచితులు అయ్యారు. జగన్ ను నమ్మిన బంటుగా ఆయనకు ఎంతో పేరుంది. అంతేకాదు రాజకీయాలలో ఉన్నా పెద్దగా అవినీతి ఆరోపణలు ఎదుర్కోని వ్యక్తి దాసన్న. కొంచెం కాస్త ఎక్కువే సున్నిత మనస్తత్వం ఉన్నవారు. అలాంటి నేత కూడా మాట మార్చడం ఏంటి?
ఇదివరకే తన రాజకీయ వారసుడు కృష్ణ చైతన్య అని, ఆయనే వచ్చే ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గంలో పోటీ చేస్తారని అన్నారు. కానీ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీ సభ్యుడిగా పోలాకి నుంచి ఎన్నికయ్యాక ఆ మాటలేవీ ఇక నెరవేరవని తేలిపోయింది. దీంతో మళ్లీ బరిలో నిలిచేది దాసన్నే అని తేలిపోయింది. ఈ క్రమంలో టీడీపీ గట్టి అభ్యర్థినే వెతుక్కోవాలి. ఇప్పటిదాకా ఉన్న ఎక్స్ ఎమ్మెల్యే బగ్గు రమణ అంత సామర్థ్యం ఉన్న నేత కాదు అని తేలిపోయింది.
2014లో ఎంఎల్ఏగా ఎన్నికయి నప్పటికీ ఆనక ఆయన ప్రభావం పెద్దగా లేదనే తేలిపోయింది. అభివృద్ధి విషయంలో కూడా ఆయన చూపిన చొరవ ఏమీ లేదని కూడా సుస్పష్టం. ఇప్పుడు టీడీపీ అచ్చెన్నను ఇక్కడ బరిలో దింపబోనుందా లేదా ఎంపీ రామూ కుటుంబం నుంచి ఎవ్వ రైనా నరసన్నపేటలో ఎంఎల్ఏగా పోటీ చేసే ఛాన్స్ ఉందా అన్న వాదన ఒకటి వినిపిస్తోంది. గతంలో రామూ మాతృమూర్తి విజయమ్మ ఇక్కడ నుంచి పోటీ చేయడం కానీ లేదా పాతపట్నం నుంచి పోటీ చేయడం కానీ చేస్తారని వార్తలొచ్చాయి. ఎందుకనో అవన్నీ గాల్లో తేలిపోయాయి. కానీ ఇప్పుడు విజయమ్మ రాక కన్ఫం అవుతుందా లేదా ఢిల్లీ రాజకీయాలకు రామూ గుడ్ బై చెప్పి గుడ్ బోయ్ రామూ నరసన్నపేట నుంచి పోటీచేస్తారా అన్నది తేలాల్సి ఉంది.