ఫ్యాన్ ఆంధ్రా : 3 లక్షల కోట్ల అప్పు ఏమైందయ్యా!
దాదాపు పదేళ్ల కష్టం తరువాత పగ్గాలు అందుకున్న వైఎస్ జగన్ కు పాలన అన్నది ఓ పెద్ద పజిల్ గా మారింది. ఆయన తన వారికి మేలు చేస్తూ, తన వారికి ప్రయోజనాలు చేకూరుస్తూ పైకి మాత్రం తాము సచ్ఛీలురం అన్న విధంగానే మాట్లాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు లేవు. ఓ విధంగా ప్రతి సంక్షేమ పథకం కూడా ఓ ఆర్థిక నేరమే అని అంటారు నిపుణులు. కానీ వైఎస్ జగన్ దృష్టిలో పాలన అంటే నోట్లు పంచడమే! ఈ క్రమంలో పోనీ ఇంతవరకూ ఏమయినా సాధించారా అంటే అదీ లేదు. గతంలో కన్నా హీనంగా రాష్ట్రం ఉంది. గతంలో కన్నా హీనంగా అభివృద్ధి ఉంది. ఎక్కడికక్కడ దారులు దరిద్రంగా ఉన్నాయి. కనీసం ప్రాజెక్టులకు నిర్వహణ లేదు. పటిష్ట రీతిలో వరదల కట్టడికి ప్రణాళికే లేదు. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా లక్ష కోట్ల సంక్షేమం అన్నది లేదు. వైఎస్సార్ కన్నా మించి పోయి జగన్ పాలన ఉంటుందని అంతా భావిస్తే, అందుకు విరుద్ధంగా జగన్ ఎఫ్ఆర్బీఎంను కూడా సవరణ చేసి అప్పులు తేవడం ఎందాక సమంజసం అని విపక్షం నిలదీస్తోంది.
ఇంకా చెప్పాలంటే...
అప్పులుంటేనే అభివృద్ధి అన్న విధంగా మాట్లాడుతుండడం ఇప్పటి ఫ్యాషన్. ఆంధ్రావనిలో గతంలో కన్నా ఎక్కువ అప్పులు చేసిన ఘనత వైసీపీ సర్కారుదే! ఓ ప్రభుత్వం ఇంతటి స్థాయిలో నిబంధనలు అతిక్రమించి అప్పులు చేయడం కూడా ఇదే ప్రథమం. అయినప్పటికీ వైసీపీ తప్పు ఒప్పుకోవడం లేదు. తాము ఏం చేసినా సర్వజన శ్రేయస్సు కోసమే చేస్తామని చెబుతున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఈ నేపథ్యంలో అప్పులెందుకు ? ఒకవేళ ఇంతటి విచక్షణా రహితంగా అప్పులు చేసినా కూడా వాటిని ఏం చేస్తున్నారు అన్న ప్రశ్నలు మనలోనే కాదు కాగ్ లోనూ ఉదయించాయి. అందుకే కాగ్ కూడా ఏపీ సర్కారును నిలదీసింది. ఈ నేపథ్యంలో మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది కాగ్ అడుగుతోంది.