అమరావతి దెబ్బ: గుంటూరులో వైసీపీకి ‘మూడేనా’!

VUYYURU SUBHASH
ఏదేమైనా అధికార వైసీపీకి రాజధాని అమరావతి దెబ్బ మాత్రం గట్టిగానే తగిలేలా ఉంది. అసలు వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమరావతిని కనుమరుగు చేయడానికి చేయని ప్రయత్నాలు లేవు. అలాగే మూడు రాజధానుల పేరుతో చేసిన రాజకీయం మామూలుగా లేదు. అసలు వైసీపీ చేసిన రాజకీయం వల్ల..ప్రజలు అమరావతిని కోరుకోవడం లేదా? అనే భావన అందరిలోనూ వచ్చింది.

అధికార వైసీపీ మూడు రాజధానుల పేరిట రెండేళ్ళు కాలక్షేపం చేశాక ...మొత్తం సినిమా అర్ధమైంది. పైగా మూడు రాజధానులపై వెనక్కి తగ్గి...మళ్ళీ తర్వాత ఇంకో బిల్లు తీసుకొస్తామని చెప్పి తప్పుని వైసీపీ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఇక ఇక్కడ నుంచే ప్రజలకు వైసీపీ రాజకీయం పూర్తిగా క్లారిటీ వచ్చింది. రాజధాని విషయంలో ఏం చేయలేక ప్రభుత్వం ఇలా డ్రామాలు ఆడుతుందని అర్ధం చేసుకుంటున్నారు. పైగా రెండేళ్లుగా అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతుల బాధలని ప్రజలు అర్ధం చేసుకున్నారు.

అందుకే రాష్ట్రంలో అమరావతికి మద్ధతు పెరుగుతుంది. అయితే ఈ అమరావతి ప్రభావం ఇప్పుడు కనిపించకపోయినా..వచ్చే ఎన్నికల్లో వైసీపీకి బాగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరులో వైసీపీకి బొమ్మ కనిపించేలా ఉంది. ఇప్పటికే జిల్లాలో రాజకీయం చాలా మారింది. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరిగింది...అలాగే టీడీపీ నేతలు పుంజుకుంటున్నారు.

అన్నిటికంటే అమరావతి దెబ్బ వైసీపీకి గట్టి తగలనుంది. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో రాజధాని ప్రభావం ఉంది. నెక్స్ట్ రాజధాని వల్ల వైసీపీకి మూడు సీట్లు కూడా వచ్చేలా కనిపించడం లేదని విశ్లేషణలు వస్తున్నాయి. తాడికొండ, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు, వినుకొండ, వేమూరు, రేపల్లె లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది.

అలాగే గుంటూరు ఈస్ట్, చిలకలూరిపేట, బాపట్ల, సత్తెనపల్లి, గురజాల లాంటి నియోజకవర్గాల్లో పార్టీ పికప్ అవుతుంది. ఇక మాచర్ల, నరసారావుపేట, పెదకూరపాడు నియోజకవర్గాల్లో వైసీపీకి పట్టు కనిపిస్తోంది. మొత్తానికైతే అమరావతి అంశం వైసీపీని ముంచేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: