ఫ్యాన్ ఆంధ్రా : మళ్లీ ఇటు రాకు వాన!
చనిపోయిన వారు.. బాధితులుగా మిగిలిన వారు
అంతా కూడా మన దేశంలో భాగం
వారేం పరదేశం వారు కాదే!
అయినా మన ప్రధాని నుంచి భరోసా లేదు
రాష్ట్రం ఇచ్చే సాయం ఎందుకూ అక్కరకు రాదు
బాబోయ్ వాన! నీకో దండం! :
మళ్లీ వానంటే గుండె లయ తప్పుతోంది.. మళ్లీ వానొస్తే ఇల్లూ వాకిలీ అన్నవి ఏవీ లేకుండా పోతాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణాన ప్రభుత్వం ఇచ్చే సాయం ఏపాటికీ సరిపోకపోయినా, మళ్లీ తమ ఇళ్లని తాము నిర్మించుకునే ప్రయత్నంలో పడ్డారు. అదేవిధంగా అప్పు చేసి అయినా సరే నిత్యావసరాల కొనుగోలు చేసేందుకు పరుగులు తీస్తున్నారు. ఇంత జరిగాక ప్రభుత్వం పై ఆధారపడడం ఓ దండగమారి చర్య అని చాలా మంది బాధితులు కన్నీరెడుతూ మీడియా ఎదుట మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఓ వెదర్ రిపోర్ట్ వెలుగు చూసింది..
అదేంటంటే.. :
నెల్లూరు దక్షిణ భాగాలు ముఖ్యంగా సూళూరుపేట, తడలో రానున్న రెండు గంటల లోపు భారీ వర్షాలు పడనున్నాయి. చిత్తూరు జిల్లా తూర్పు భాగాల్లో మోస్తరు వర్షాలు కొనసాగనుంది. కడప జిల్లాలో తేలికపాటి వర్షాలు కొనసాగుతాయి. ఇప్పుడు అల్పపీడ నం మన్నార్ (శ్రీలంక - భారత్ సరిహద్దు) ప్రాంతంలోకి ప్రవేశించింది. రాత్రికి వర్షాలు మరింత పెరుగుతాయి. గుంటూరు, కృష్ణా, ప్ర కాశం జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది.
- ఇదీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మేన్ పేరిట ఎఫ్బీలో వచ్చిన పోస్టు
జనులారా జాగ్రత్త ! :
తీవ్ర వర్షాలతో ఆంధ్రావని అతలాకుతలం అయిన నేపథ్యంలో మళ్లీ అదే కబురు ఒకటి వాతావరణ సంబంధ ప్రకటనల రూపంలో వినవస్తుంటే ప్రజలు వణికిపోతున్నారు. రెట్టించిన భయాందోళనలతో కాలం గడుపుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠత వారిలో నెలకొని ఉంది. ఇప్పటికీ వరద నుంచి తేరుకోని లేదా కోలుకోని ప్రాంతాలు ఉన్నాయి. చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు భారీ వానలతో వరదలతో తీవ్రంగా ప్రభావితం అయి కొన్ని ప్రాంతాలు ఏమీ లేకుండా పోయాయి. అసలు అడ్డూ అదుపూ లేకుండా కొన్ని కబ్జాల కారణంగా చెరువుల కబ్జాల కారణంగా ఇంతటి విలయం లేదా జల ప్రళయం సంభవించిందని ఆధారాలతో సహా ప్రింట్ మీడియా కథనాలు ప్రచురించింది. అయినప్పటికీ ప్రభుత్వంలో కదలిక రాలేదు. ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. అన్నమయ్య, పింఛ ప్రాజెక్టులు ఏమీ మిగలకుండా పోయాయి. అయినా కూడా జగన్ మాత్రం కుటుంబానికి రెండు వేల రూపాయలు పంపిణీ చేస్తున్నామని చెబుతున్నారే కానీ కబ్జాల నివారణకు కానీ తొలగింపునకు కానీ చర్యలు చేపడతాం అని ధైర్యం చేసి ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నారు. ఇది కదా బేలతనం. ఇది కదా అసర్థత! అని అంటోంది విపక్షం. దేవుడా ! రక్షించు ఆంధ్రావనిని! విపత్తుల నుంచి విలయాల నుంచి! మరియు ఇంకెన్నింటి నుంచో!