ధాన్యం కొనుగోలు విషయం, రాష్ట్ర విభజన సమస్యల పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఢిల్లీలో మూడు రోజుల పాటు ఉండి ఎవరిని కలవకుండానే తిరిగి వెనక్కి వచ్చేశారు. దీంతో సీఎం కేసీఆర్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పేరంటానికి వెళ్లొచ్చినట్టు ఢిల్లీకి వెళ్లారని కేసీఆర్ను ఎద్దేవా చేస్తున్నారు విపక్ష నేతలు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదని టీఆర్ఎస్ వర్గాలు చెప్పుకొచ్చాయి.
ప్రధాని మోడీ, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ఇప్పట్లో దొరకదనే విషయంపై స్పష్టత రావడంతో సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలంగాణ ప్రభుత్వంతో పాటు సీఎం కేసీఆర్ను ఇరకాటంలో పెట్టే ప్రకటన చేశాయి. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవడానికి వీలుగా ఇటీవల తెలంగాణ సీఎం కార్యాలయం లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు గురువారం ప్రకటించాయి.
గత నెల సెప్టెంబర్ ఒకటవ తేదిన అపాయింట్మెంట్ కోసం విజ్ఞప్తి వచ్చిందని దాంతో అదే నెల మూడో తేదిన అపాయింట్మెంట్ ఇవ్వడంతో సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ, అమిత్ షా ను కలవడం జరిగిందని తెలిపాయి. తాజాగా వారి అపాయింట్మెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తులు రాలేవని పేర్కొన్నాయి. నీటి పంపకాలు, వరి ధాన్యం కొనుగోలు గురించి కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవడానికి ఢిల్లీకి వెళ్తామని అవసరం అయితే తాను ప్రధాన మంత్రిని కలుస్తాని విలేకరుల సమావేశంలో చెప్పిన కేసీఆర్.. ఆదివారం మంత్రులు, అధికారులతో కలిసి ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.. మూడు రోజుల పాటు అక్కడే ఉన్న కేసీఆర్ బుధవారం రాష్ట్రానికి వచ్చేశారు.
అయితే, మూడు రోజల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్ ప్రధాని, మంత్రుల అపాయింట్మెంట్ కోసం ఎదురు చూశారని, కానీ.. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చేసేదేమీ లేక తిరిగి వచ్చామని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కేంద్రం చేసిన తాజా ప్రకటనతో కేసీఆర్ అడ్డంగా బుక్ అయ్యారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.