టీడీపీ నయా ప్లాన్... ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు...!

Podili Ravindranath
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్‌గా ఉన్నాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జరిగిన వ్యవహారాలు  అటు దేశ రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చకు తెరలేపాయి. సభలో రెండో రోజు జరిగిన వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఓ కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై అధికార పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు చంద్రబాబు కూడా ప్రజాక్షేత్రంలో మళ్లీ గెలిచిన తర్వాతే సభలో అడుగుపెడతా అంటూ శపథం కూడా చేశారు. అయితే ఇవన్నీ పొలిటికల్ గేమ్ అని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. కానీ టీడీపీ మాత్రం ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు మెగా ప్లాన్ వేసింది. ఇప్పటికే కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని వరద బాధితులను పరామర్శించిన చంద్రబాబు... తనకు అవమానం జరిగిందనే విషయాన్ని బహిరంగ సభల్లో వివరించారు కూడా. అటు టీడీపీ నేతలు కూడా ఇప్పుడు సరికొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
తాజాగా జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా ఇదే విషయంపై కీలకంగా చర్చించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించిన తీరుపై నారా భువనేశ్వరి కూడా లేఖ విడుదల చేశారు. దీంతో ఈ అంశంపై వైసీపీని మరింత ఇరుకున పెట్టేందుకు టీడీపీ నేతలు ప్లాన్ వేస్తున్నారు. వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రజా పోరాటం చేయాలని టీడీపీ భావిస్తోంది. దీనికి ఆడపడుచుల ఆత్మ గౌరవం అనే పేరు కూడా పెట్టారు. ఇదే విషయంపై టీడీపీ పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నారు. మహిళల వ్యక్తిత్వంపై దాడి చేశారంటూ ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అలాగే వరద మరణాలపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం మానవ తప్పిదం వల్లే జరిగినట్లు ఆరోపిస్తున్నారు. వరద మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని కూడా టీడీపీ డిమాండ్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: