అభివృద్దే కాదు.. పేదరికం కూడా ఒక్కచోటేనా..!
అవును ఇది ప్రజాస్వామ్యదేశం కదా, అంటే ప్రజలే దేవుళ్ళు. వాళ్ళ కోసం అభివృద్ధి చేస్తున్నప్పుడు ఇతర స్థలాలను వాడాలి కానీ దేవుడి స్థలాలను లాక్కుంటున్నారేమిటో? అయితే ఇది ప్రజాస్వామ్యం కాకపోయుండాలి లేదా అది పేరుకు మాత్రమే తప్ప నిజంగా లేకపోయి ఉండాలి, బహుశా అదే అయ్యి ఉంటుంది. అందుకే అభివృద్ధి ఒక్కచోటే ఉంటుంది. అలాగే పేదరికం కూడా ఒక్కచోటకు చేరిపోతుంది. తాజా నీతి ఆయోగ్ కూడా అదే తేల్చిని. కాకపోతే వాళ్ళు ఇంత బాహాటంగా చెప్పలేక, వాళ్ళ పరిధిలో చెప్పారు. నీతి ఆయోగ్ కూడా ప్రభుత్వం చెప్పినట్టు, వాళ్లకు అనుకూలంగానే ఈ నివేదికలు ఇవ్వడం జరుగుతుందేమో ఎవరికి ఎరుక, న్యాయస్థానాలనే నేతలు శాసిస్తున్నారు కాబట్టి నీతి ఆయోగ్ పెద్ద విషయమా అని అనుకోవాల్సి వస్తుంది.
ఈ నివేదికలో ఒక రాష్ట్రంలో పేదరికం 50 శాతం పైనే ఉందని చెప్పారు. రాష్ట్రంలో 50 శాతం అంటే అక్కడ పరిస్థితి ఊహించవచ్చు. 75 ఏళ్ళ భారతం ఇంత గొప్పగా తీర్చిదిద్దిన ఘనత మన నేతలకే దక్కింది. ఈ సందర్భంలో వాళ్ళను తలుచుకొని తీరాలి కాబోలు. ఇంకేమైనా అంటే ఎక్కువ జనాభా ఉన్న దేశం అని చెప్పేస్తారు. ఎక్కువ మానవ వనరులు ఉన్నాయని మాత్రం ఒప్పుకోలేరు. వాటిని ఉపయోగించుకోవడంలో ఏ ప్రభుత్వం సఫలీకృతం కాలేకపోయింది. ఉన్న వనరులను తగిన రీతిలో ఉపయోగించుకోవడం, నిర్వహించడం అనేవే కదా నేతల బాధ్యత, అవే సరిగా చేయలేనప్పుడు ఇక వాళ్ళు చేసేవి ఏముంటాయి, దండుకోవడం తప్ప. అదే మనవాళ్లకు బాగా తెలిసిన విద్య. దాని పరియవశానమే ఈ సూచిక.