టార్గెట్ గోవా.. బీజేపీ చీఫ్ నడ్డా పర్యటన...!
రెండు రోజుల పర్యటన కోసం జేపీ నడ్డా గోవాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని జేపీ నడ్డా కార్యకర్తలకు సూచించారు. పనాజీలోని మహాలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి కార్యకర్త క్షేత్ర స్థాయిలో పర్యటించాలని... ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేయాలని నడ్డా సూచించారు. మోదీ సర్కార్ సూచించిన సబ్ కా సాత్... సబ్ కా వికాస్... సబ్ కా విశ్వాస్... సబ్ కా ప్రయాస్... నినాదానికి కార్యకర్తలంతా కట్టుబడి ఉండాలన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలని జేపీ నడ్డా ఆదేశించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ఇంఛార్జ్గా మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను జేపీ నడ్డా నియమించారు. కో ఇన్ఛార్జ్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ దర్శన్ జర్దోష్లు వ్యవహరిస్తున్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలతో అతి పెద్ద పార్టీగా నిలిచింది. అయితే 13 మంది సభ్యులున్న బీజేపీ మాత్రం... ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి మాత్రం సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గట్టి పట్టుదలతో ఉంది.