నెల్లూరు జిల్లా పోలీసుల అత్యుత్సాహం...!
ఇప్పటికే అమరావతి రైతుల మహా పాదయాత్ర విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న నెల్లూరు జిల్లా పోలీసులు.. మరో వివాదంలో చిక్కుకున్నారు. నిన్న వరద ప్రాంతాల్లో పర్యటనకు నెల్లూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వెళ్లారు. అయితే దాదాపు పది రోజులుగా వర్షాలు కురుస్తున్నా కూడా తమను ఎవరు పట్టించుకోలేదని.. ఇప్పుడు మీరు వచ్చింది ఎందుకూ అంటూ అక్కడి స్థానికులు మంత్రిని, ఎమ్మెల్యేను నిలదీశారు. సాయం చేయకుండా రాజకీయాలు చేస్తారా అని నిలదీశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులను అడ్డుకుని... మంత్రి బాలినేనిని, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని అక్కడి నుంచి పంపేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని స్థానికులు వీడియో తీశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు... పోస్ట్ చేసిన ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకుని కోవూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరంతా స్థానిక జనసేన పార్టీ కార్యకర్తలు కావడంతో... జనసేన నేతలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.