విశాఖపైనే మాకు ప్రేమ ఎక్కువ.. ఉండాలి కూడా! మేం రేపటి వేళ అడ్మిన్ క్యాపిటల్ గా కాస్తో కూస్తో దృష్టి సారించేది ఈ ప్రాంతం పైనే! అంతేకాదు తమకు అమరావతి ముఖ్యం కానేకాదని చెబుతూనే విశాఖ కేంద్రంగా భూ పందేరానికి ఆస్తుల వేలానికి తెగ తాపత్రయపడుతోంది వైసీపీ సర్కారు అన్నది ఓ ఆరోపణ. ఈ ఆరోపణలో నిజా నిజాలు తేల్చాల్సింది ఎవరు? అసలు తామేం తప్పులూ చేయడం లేదు అని చెప్పాల్సింది వాటి ఉనికిని నిరూపించాల్సింది తమ ఉనికిని కాపాడుకోవాల్సింది ఎవరు? జగన్ అండ్ కో నే కదా! కనుక ఇప్పుడు కూడా క్విడ్ ప్రోకో జరుగుతూనే ఉంది కానీ వెలుగులోకి రావడంలేదు. ఆ విషయమై పత్రికలు చేస్తున్న పని శూన్యం.
చాలా రోజులకు వైసీపీ ఒక సంచలనం అయిన నిర్ణయం ఇచ్చి అందరిలోనూ ఆందోళనలను నింపింది. అనిశ్చితిని ప్రోది చేసింది. పోగు చేసింది. ఇష్టం వచ్చిన విధంగా కాకుండా తమకు అనుగుణంగా తమకు అనుకూలంగానే నిర్ణయాలు ఉంటాయని చెబుతూ నే, తమ ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుందో ఏం చేయాలనుకుంటున్నదో అన్నవి మాత్రం చెప్పేందుకు కాస్త సమయం కావాలనే అంటోంది. రాష్ట్రం విడిపోయి ఏడున్నరేళ్లు అయినా ఇంకా అభివృద్ధి లేనేలేదని రాజధాని రానేరాదని ఆ లెక్క ఇప్పటికిప్పడు తేలిపోదని చెబుతున్నాయి తాజా పరిణామాలు. ఈ నేపథ్యంలో అమరావతి అన్నది క్యాపిటలిస్టుల క్యాపిటల్ అని విశాఖ అన్నది ప్రజలతో నిర్మితం అయిన రాజధాని అని చెప్పుకుంటోంది వైసీపీ.
అంటే అమరావతి కేంద్రంగా జరిగే అభివృద్ధి అంతా ఫ్యూడలిస్టిక్ టెండెన్సీతోనే ఉంటుందని అందుకే తమకు ఆ రాజధాని నచ్చడం లేదని, అందుకే తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ ప్రాంతం కన్నా మరో ప్రాంతం అయితే ఇంకా సులువుగా అభివృద్ధి చేసుకోవచ్చన్న తలంపులో భాగంగా అదే పనిగా పనిచేస్తున్నామని వైసీపీ సోషల్ మీడియా అంటోంది. రానున్న కాలంలో కూడా అమరావతి కన్నా విశాఖ అభివృద్ధే తమకు ముఖ్యమని అంటోంది వైసీపీ. ఇంతకూ విశాఖపై ఇంత ప్రేమ ఎందుకు?