నారా భువనేశ్వరి కాళ్లు పట్టుకుంటా.. అంబటి సంచలన వ్యాఖ్యలు..?

Chakravarthi Kalyan
నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన రగడ పెను కలకలానికి దారి తీసింది. తన భార్యను అవమానించారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్ మీట్‌లో నోట మాట రాక భోరున విలపించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇప్పుడు మాటల యుద్ధం సాగుతోంది. అయితే.. ఈ వివాదానికి మూల కారణంగా భావిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వాదన మరోలా ఉందా. అసెంబ్లీలో అంబటి రాంబాబు మాట్లాడుతున్న సమయంలో కొందరు టీడీపీ నేతల రన్నింగ్ కామెంట‌రీ సాగింది. తాను అన్నీ వివరిస్తా అని అంబటి అంటున్నప్పడు.. గంట సరిపోతుందా.. అంటూ టీడీపీ నేతలు వ్యంగ్యంగా అనడం వినిపించింది.

గతంలో అంబటి రాంబాబు ఫోన్ కాల్ పేరుతో కొన్ని ఆడియో క్లిప్పులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అందులో గంట సేపట్లో పంపిస్తా అన్న మాటలు బాగా పాపులర్ అయ్యాయి. అలాగే మంత్రి అవంతి పేరుతో కూడా కొన్ని ఆడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆయన అరగంటలో పంపిస్తా అన్నట్టు ఆడియోలు క్లిప్‌లు ఉన్నాయి. వీటిలో నిజమెంతో తెలియదు.. కానీ అవి బాగా జనంలోకి వెళ్లాయి. ఇప్పుడు వాటిని ఉద్దేశించి టీడీపీ నేతలు అంబటిపై సెటైర్లు వేశారు. గంట సరిపోతుందా.. అని కొందరు అంటే.. అరగంట.. అరగంట అంటూ ఇంకొందరు ఎగతాళి చేశారు.

దీంతో ఆగ్రహించిన అంబటి.. అలా మాట్లాడాలంటే అన్నీ మాట్లాడదాం.. మాధవరెడ్డి విషయం కూడా మాట్లాడదాం అన్నారు. తాను అంతకు మించి ఇంకేమీ మాట్లాడలేదని.. నారా భువనేశ్వరి పేరు కూడా తాను ఎత్తలేదని అంబటి ఓ ఛానల్‌లో వివరణ ఇచ్చారు. అంతే కాదు.. తనకు నారా భువనేశ్వరి అంటా చాలా గౌరవం ఉందని.. తాను ఆమెను కించపరిచినట్టు ఏదైనా ఆధారం చూపితే.. ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతాను అంటూ ఆయన ఆ టీవీ ఛానల్ చర్చలో ప్రకటించారు.

మరి టీడీపీ వాళ్లు ఇది మంచి అవకాశమే.. నిజంగానే అంబటి ఏమైనా అన్నట్టు రికార్డులు ఉంటే.. ఆధారాలుంటే చూపించి.. అంబటితో భువనేశ్వరి కాళ్లు పట్టించవచ్చు. అయితే.. అంబటి అన్న తర్వాత బ్యాక్ డ్రాప్‌లో ఇంకొందరు ఇష్టానుసారం మాట్లాడారని కొందరు టీడీపీ నేతలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: