ఇక కుప్పంలోనూ వార్‌ వన్‌సైడేనా..?

Chakravarthi Kalyan
మాజీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజక వర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. అయితే తొలిరోజు చంద్రబాబు పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఎవరో చంద్రబాబు పై బాంబు వేసేందుకు ప్రయత్నించాడంటూ టీడీపీ శ్రేణులు నానా రచ్చ చేశాయి. అయితే.. ఈ రచ్చ అంతా కుప్పంలోనైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచేందుకు చేసే ప్రయత్నమే అన్న విమర్శలు వస్తున్నాయి. ఇకపై కుప్పంలో ఏ ఎన్నిక జరిగినా.. వార్ వన్ సైడేనని.. విజయం వైసీపీదేనని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు... ఇకపై తన క్యాడర్ మొత్తం చేజారి పోతుందన్న భయంతోనే దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేత ఆర్కే రోజా షాకింగ్ కామెంట్లు చేశారు. ఇలా చేస్తే చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలి పోతారని ఆర్కే రోజా హెచ్చరించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, అతనిని నమ్మి ఓటేసిన కుప్పం నియోజకవర్గ ప్రజలకి హంద్రీ నీవా ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు కూడా ఇవ్వలేదని రోజా ఆరోపించారు. అంతే కాకుండా  ఇప్పుడు వచ్చి జగన్‌మోహన్ రెడ్డి నీరు ఇవ్వలేదని విమర్శించడం ఎక్కడి న్యాయం అని రోజా ప్రశ్నించారు.

చంద్రబాబు కుప్పంలో కనీసం ఇళ్లు, కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోలేదని రోజా గుర్తు చేశారు. కుప్పం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమాలను గాలికి వదిలేసి ఇప్పుడు చంద్రబాబు ప్రజలని ఓట్లు వేయమని అడగడం హాస్యాస్పదమంటూ రోజా ఎద్దేవా చేశారు. అంతే కాకుండా చంద్రబాబు.. ఇప్పుడు సిగ్గు లేకుండా కుప్పానికి రండి తేల్చుకుందాం అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు రోజా. ఇప్పటికే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు టీడీపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని చంద్రబాబుకు రోజా సూచిస్తున్నారు.

ఇటీవల పట్టాభితో బూతు డ్రామాలు ఆడించిన చంద్రబాబు.. తాజాగా కుప్పంలో బాంబు డ్రామా ఆడించి ప్రజలని నమ్మించాలని చూసారని రోజా అన్నారు. ఇలా చేస్తే ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరన్న రోజా.. కుప్పంలో ఏ ఎలక్షన్స్ జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్టుగా జగన్‌మోహన్‌ రెడ్డికే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: