బద్వేలు: జగన్ స్ట్రాటజీ మార్చేశారా...!
జగన్ లక్ష మెజార్టీ రావాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారట. మరో వైపు బీజేపీ నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ తమ పార్టీకి 20 వేలకు తగ్గకుండా మెజార్టీ వచ్చేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. తమ సొంత జిల్లాలో జరుగుతోన్న ఉప ఎన్నిక కావడంతో 20 వేల ఓట్లు వస్తే తనకు అధిష్టానం దగ్గర పలుకు బడి పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు.
ఒక వేళ బీజేపీకి 20 వేల ఓట్లు వస్తే వైసీపీ అనుకున్న లక్ష ఓట్ల మెజార్టీ రావడం కష్టం అవుతుంది. ఇవన్నీ ఆలోచించే వైసీపీ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యేలా ప్లాన్ చేసుకుంటోంది. ప్రతి ఓటు బూత్ కు రావాలని .. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ద్వితీయ శ్రేణి కేడర్ కు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇక్కడ ఇతర పార్టీలకు చెందిన ఓటర్లు న్యూట్రల్ గా ఉండకుండా వైసీపీకి టర్న్ చేస్తే అది భవిష్యత్తు లో టీడీపీ కి నష్టం అని అంచనా వేస్తున్నారు.
కడప జిల్లాలో ఇప్పటికే వైసీపీకి ఓటు బ్యాంకు అన్ని నియోజకవర్గాల్లోనూ 50 శాతం దాటేసింది.. దీనిని మరింత గా పెంచుకునే క్రమంలోనే బద్వేల్ ఉప ఎన్నికను వాడుకోవాలన్న కొత్త స్ట్రాటజీ వైసీపీలో కనిపిస్తోంది. రేపటి రోజున కడప పార్లమెంటు మెజార్టీని మరింతగా పెంచు కోవాలని కూడా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకు బద్వేల్లో ఓటు బ్యాంకు సుస్థిరం చేసుకునేందుకు ఈ ఉప ఎన్నిక వాడుకోనున్నారు.