పట్టాభి ప్రాణాలకు ముప్పు..! అదీ చంద్రబాబు నుంచే..?
దీనికితోడు.. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పట్టాభిని అరెస్టు కూడా చేశారు. ఆ తర్వాత వెంటనే పట్టాభికి బెయిలొచ్చింది. ఇంతలో పట్టాభి మాల్దీవులకు పారిపోయారంటూ మరో పుకారు వార్త వచ్చింది.. అబ్బే నేను.. ఎక్కడికీ పారిపోలేదు.. మొన్న మా ఇంటిపై దాడి జరిగినప్పుడు మా పాప బాగా భయపడింది. అందుకే అలా కాస్త గాలి మార్పు కోసం వెళ్లాను.. త్వరలోనే మళ్లీ వస్తా.. డ్రగ్స్ పై పోరాడతా అంటూ పట్టభి ఓ ప్రకటన కూడా చేసారు.
అయితే ఇప్పుడు వైసీపీ నేతలు ఓ కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. అదేంటంటే.. చంద్రబాబునాయుడి నుంచే ఆ పార్టీ నేత పట్టాభికి ప్రాణహాని పొంచి ఉందట. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం పట్టాభి ప్రాణాలు తీసే ప్రమాదం ఉందట. ఆ నేరాన్ని వైయస్సార్ సీపీపై నెట్టి ప్రజల్లో సానుభూతి పొందాలనే కుట్ర చంద్రబాబు చేస్తున్నారట. ఈ ఆరోపణలన్నీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చేస్తున్నారు.
అందుకే పట్టాభి రక్షణ విషయంలో ఆయన కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ద్వారంపూడి అంటున్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు పార్టీ మనుగడ కోసం ఎంతకైనా దిగజారుతారే ప్రమాదం ఉందని ద్వారంపూడి అంటున్నారు. చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్షా అపాయిట్మెంట్ కోరడంపైనా ద్వారంపూడి స్పందించారు. ఒకప్పుడు అమిత్షా కాన్వాయ్పై రాళ్ల దాడి చేయించిన చంద్రబాబు ఇప్పుడు ఆయన్ను కలుస్తానని అడగటానికి సిగ్గుండాలని కామెంట్ చేశారు ద్వారంపూడి. అయినా రాజకీయాల్లో సిగ్గుపడితే కుదురుతుందా.. ఆ సంగతి ద్వారంపూడికి తెలియదా ఏమిటి..?