కేసీఆర్ పాలన చేస్తున్నారా..? గాడిదల కాస్తున్నారా..? : షర్మిల
పాదయాత్రలో ప్రజలను పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన చేస్తున్నారా..? లేక గాడిదలు కాస్తున్నారా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలు పట్టించుకోకుండా ఫామ్ హౌస్ లో మొద్దు నిద్ర పోతున్నారని పేర్కొన్నారు. 36 లక్షల మంది రైతులను కేసీఆర్ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాళి బొట్టు తాకట్టు పెట్టి ఫీజులు కడుతున్నారు. మా బతుకులు ఆగం అయ్యాయని మహిళలు బాధపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. కరోనా అని చూడకుండ కూడ రూ.30 వరకు పెంచారు. కరోనా సమయం లో ధరలు తగ్గకుండా పెంచుకుంటూ పోతున్నారు, బేస్ ధర మీద 60 రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తున్నారని.. దీంతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని వెల్లడించారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ కలిసి పెట్రోల్ ధరలను పెంచి రక్తం ప్రజల రక్తం పిండుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కి ఎంత పాపం ఉందో కేసీఆర్ కి కూడ అంతే పాపం ఉందన్నారు. బతుకమ్మ చీరలు అడగలేదు మేము. ఉద్యోగాలు అడిగాం ఇచ్చారా అని ప్రశ్నించారు.
డబుల్ బెడ్రూం అడగలేదు, నువ్వే ఇస్తామని హామి ఇచ్చావు.. మరీ ఎందుకు ఇవ్వలేదని అడిగారు. అర్హులైన వారందరికీ తెల్లరేషన్ కార్డులు లేవని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవన్నారు. ఇప్పటికే కేసీఆర్కు రెండు సార్లు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి వైఎస్సార్ తెలంగాణకు అవకాశం ఇవ్వండి. రాష్ట్రంలో వైఎస్సార్ పాలన మళ్లీ తీసుకొస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు షర్మిల.