ఆంధ్రప్రదేశ్లో ఉన్నపలంగా రాష్ట్రపతి పాలన విధించాలని పదే పదే డిమాండ్ చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, దీనికి ఉదాహరణగా తమ పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతల దాడులను చూపిస్తున్నారు. అయితే, ఒకపార్టీ ఆఫీస్ పై మరోపార్టీ శ్రేణులు దాడులు చేస్తే శాంతి భద్రతలకు ఏ విధంగా విఘాతం కలిగినట్లు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అయితే, ఫ్యాన్ పార్టీ శ్రేణులు టీడీపీ ఆఫీసుపై దాడులు చేయడానికి టీడీపీ నేత పట్టాభీ చేసిన వ్యాఖ్యలే కారణం అని అందరికీ తెలిసిన విషయమే.
అయితే, దాడులు చేయడం తప్పయితే ఒక రాష్ట్రానికి సీఎం అయిన జగన్ పట్టుకుని నోటికొచ్చినట్టు పట్టాభీ తిట్టడం తప్పే అని విశ్లేషకులు అంటున్నారు. అయితే చంద్రబాబు నాయకుడు మాత్రం పట్టాభిని సమర్ధిస్తు వైసీపీ దాడులను మాత్రమే తప్పుపట్టడం గమనార్హం. మరి ఇంతటి విషయానికే కేంద్రం జోక్యం చేసేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడుతుందా అంటే అది సాధ్యం కాదని తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నప్పుడు. అంటే సామాన్య ప్రజలు స్వేచ్ఛగా బతికే అవకాశాలు లేనప్పుడు మాత్రమే శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని అంటారు.
అలాగే, రాష్ట్ర గవర్నర్ కేంద్రానికి లేఖ రాసినప్పుడే కేంద్రం ఆలోచిస్తుంది. టీడీపీ వైఖరి ఎలాగుందంటే తాము సీఎం జగన్ ను ఎన్నైనా అనవచ్చు.. వ్యక్తి గత విమర్శలు చేయొచ్చు కానీ, ప్రభుత్వం మాత్రం తమపై ఎలాంటి కేసులు నమోదు చేయకూడదు అనే విధంగా ఉంది. విధానపరంగా ఆరోపణలు విమర్శలు చేయడం వదిలేసి వ్యక్తిగతంగా నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నారు కాబట్టే ప్రభుత్వం కేసు పెడుతోంది.
రాష్ట్ర బంద్ విఫలం కావడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పట్టించుకోని కారణంగానే ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. 36 గంటల దీక్ష అనంతరం హస్తినకు వెళ్లి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రిని కలిసి రాష్ట్రపతి పాలనను పెట్టాలని కోరాడానికి. మరి ఢిల్లీ పర్యటన ఏమవుతుందో వేచి చూడాలి.