ఏపీలో ప్రస్తుత పరిణామాలు ఎవరికి లాభం.. టిడిపి సాధించిందేమిటి..!

MOHAN BABU
ఏపీలో ప్రస్తుతం బూతు రాజకీయం నడుస్తోంది. సీఎం జగన్ పై టీడీపీ నేత పట్టాభి నోరు జారడం ఆ తర్వాత టిడిపి ఆఫీస్ పై దాడి, చంద్రబాబు దీక్షకు దిగడం, ఒకదాని తర్వాత ఒకటిగా చకచకా జరిగిపోయాయి. బాబు దీక్షకు పోటీగా వైసీపీ కూడా జనాగ్రహ దీక్షకు పిలుపునిచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవరికి మైలేజ్ వచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో పట్టాభి   తిట్ల ఎపిసోడ్లో కూడా టిడిపి, వైసిపి పోటాపోటీగా ఎత్తులు వేశాయి. కానీ అంతిమంగా వైసీపీ కే లబ్ధి కలిగిందనే వాదన వినిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో మాటల మంటలు రేగుతున్నాయి. టిడిపి నేత పట్టాభి సీఎం పై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. పట్టాభి వ్యాఖ్యలపై మండిపడ్డ వైసీపీ శ్రేణులు  నిరసనకు దిగాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పై  ప్రతిపక్షానికి చెందిన ఒక నేత అలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా..? అసలు అలాంటి పదాలు రాజకీయాల్లో వాడొచ్చా? ప్రజాప్రతినిధులుగా ఉన్న నాయకులు ఇలాంటి  కామెంట్స్ మాట్లాడొచ్చా..? ఇవేవి ఆలోచించకుండా ఇష్టానుసారం మాట్లాడిన పట్టాభి ని టిడిపి నేతలు వెనకేసుకు రావడం తో కామెంట్లతో రేగిన చిచ్చు పోలీస్ స్టేషన్ లు,నిరసన దీక్షల వరకు వెళ్ళింది. అసలు ఈ అంశంలో టిడిపి సాధించింది ఏమిటి..? సమకాలీన అనుభవాల్లో చంద్రబాబు రాజకీయానికి తిరుగేలేదు. ప్రతిపక్ష నేతగా కానీ, ముఖ్యమంత్రిగా కానీ ఆయనకున్నంత అనుభవం ఇప్పుడున్న రాజకీయ నేతల్లో ఎవరికీ లేదు.

అలాంటి నేతకు ఈ మాత్రం వివాదాన్ని డీల్ చేయడం పెద్ద కష్టమేం కాకూడదు . సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలను అవలీలగా దాటేసిన చంద్రబాబు ఈసారి కూడా ఆ పరిణితిని చూపించారా. ఎవరి పార్టీ నేతలను వారు కాపాడుకోవాల్సిందే. కానీ ప్రజల ముందు చులకన కాకుండా  చూసుకోవాలి. చంద్రబాబు లాంటి సీనియర్ నేత నుంచి ఆశించే పెద్దరికాన్ని కూడా ప్రదర్శించాలి. రాజకీయ విలువల్లో తర్వాత తరాలకు ఆయనొక ఆదర్శంగా నిలవాలని ఆశించడం తప్పేం కాదు. కానీ పట్టాభి విషయంలో మాత్రం అలాంటి ఆదర్శాలకు అవకాశం లేకుండా చేశాడని ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ఎంతటి రాజకీయ ప్రత్యర్దులయినప్పటికీ విమర్శించేటప్పుడు వినియోగించే భాష ముఖ్యం. మాట్లాడే ప్రతి పదం మర్యాదగా ఉండాలి. ఓవైపు బలమైన మెజారిటీతో వైసిపి అధికారంలో ఉంది. అలాంటప్పుడు కచ్చితంగా ఆచితూచి అడుగులు వేయాలి. అధికార పక్షం  ఉక్కిరిబిక్కిరి అయ్యేలా ఎత్తులు వేయాలి. కానీ టిడిపి అలాంటి వ్యూహాలను వదిలేసి సెల్ఫ్ గోల్ చేసుకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓవైపు జగన్ సీఎంగా అధికారిక  కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా వైసిపి సీనియర్లు పార్టీ క్యాడర్ను ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంచుతున్నారు. ఎక్కడైనా నేతలు అదుపు తప్పితే నేరుగా సీఎం పిలిచి మందలిస్తున్నారు. కానీ టీడీపీ లో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది పరిస్థితి. చంద్రబాబు ఏపీలో లేరు కాబట్టి తామెందుకు పనిచేయాలి అన్నట్లుగా సీనియర్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో సీనియర్లందరూ  ఇళ్ల కే పరిమితమవుతున్నారు. కనీసం రోడ్డెక్కి పోరాటాలు చేయాలనుకోవడం లేదు. ప్రతి దానికి చంద్రబాబు నుంచి నిర్దేశం రావాల్సిందే అన్నట్టుగా ఉంటున్నారు. నియోజకవర్గ స్థాయి సమస్యలపై ఆయన పోరాడదామని క్యాడర్ ఒత్తిడి తెస్తున్న చలనం రావడం లేదు. నిజానికి టిడిపి క్యాడర్ యాక్టివ్ గానే ఉందని నేతలే ఇన్ ఆక్టివ్ అయ్యారనే వాదన కూడా ఉంది. నిజానికి వైసీపీ నేతలతో పోలిస్తే టిడిపి నేతల్లో ఎక్కువమంది అనుభవజ్ఞులు ఉన్నారు. వీళ్లలో చాలా మందికి ప్రజా సమస్యలపై లోతైన అవగాహన ఉంది.

చాలామంది రాష్ట్ర మంత్రుల కంటే సబ్జెక్ట్ ఎక్కువగా ఉన్న నేతలు కూడా ఉన్నారు. కానీ అందరూ ఉండి కూడా బలమైన అంశాన్ని  వెతుక్కోకుండా, ప్రజా సమస్యలను హైలెట్ చేయకుండా  ఇలాంటి అనవసర వివాదాలు ఎందుకు కొనితెచ్చుకుంటున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతిపక్షం అడగడుగునా ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై నిలదీయాలి. సర్కార్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని స్కాన్ చేయాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా రచ్చ రచ్చ చేయాలి. అప్పుడు ప్రభుత్వానికి ప్రతిపక్షం అంటే భయం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతిపక్షమే సెల్ఫ్ గోల్స్ చేసుకుంటుంటే అది అధికారపక్షానికి అడ్వాంటేజ్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: