మళ్లీ మళ్లీ వివాదాల్లోకి ఏపీ పోలీసులు...!
వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారనే అపవాదు పోలీసులపై ఉంది. ఆ తర్వాత వైసీపీ నేతలు దాడులు చేస్తే... వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇక కరోనా వైరస్ సమయంలో వైసీపీ నేతలు భారీ ర్యాలీలకు అనుమతి ఇచ్చి బందోబస్తు కూడా నిర్వహించిన పోలీసులు... తెలుగుదేశం పార్టీ నేతలపై మాత్రం కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు కారుపై దాడి జరిగితే... దాడి చేసిన వారిని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోక పోగా... దేవినేని ఉమాపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి జైలులో కూడా పెట్టారు. ఇక పట్టాభి ఇంటిపై రెండు సార్లు దాడి జరిగితే... ఇప్పటి వరకు దాడి చేసిన వారిని అరెస్ట్ చేయలేదు. కానీ.... పట్టాభిపై మాత్రం ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపారు కూడా. ఇక చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయంలో చేపట్టిన దీక్షకు హాజరయ్యే నేతలను అడ్డుకున్నారనే అపవాదు కూడా పోలీసులు మూట గట్టుకున్నారు. కానీ వైసీపీ నేతల జనాగ్రహ దీక్షలకు మాత్రం దగ్గరుండి బందోబస్తు నిర్వహించారు. వైసీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.