తమ నాయకుడ్ని అనరాని మాటలు అన్నారన్న కోపం వైసీపీకి ఉంది. దీనిని ఎవ్వరూ కాదనరు. అదేవిధంగా అనరాని మాటలు అన్న వ్యక్తిపై కూడా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా ఉంది. ఇది కూడా సమంజసమే. కానీ ఇదే సాకుగా టీడీపీ నాయకులు వైసీపీని టార్గెట్ చేస్తున్న విధానం ఏమీ బాగాలేదు. ఎంతో అనుభవం ఉన్న నాయకుడ్ని ఉద్దేశించి వైసీపీ వాడు తున్న భాష అస్సలు బాలేదు. ఆయన పాలన బాలేదు అని చెప్పండి కానీ మరీ! అథమ స్థాయిలో రాష్ట్రాన్ని అయితే నెట్టలేదు కదా! అన్న వాదన కూడా వినపడుతోంది. ఉమ్మడి ఆంధ్రాలో కూడా ఇన్ని తిట్లు లేవని, అవశేషాంధ్రలో మాత్రం వైసీపీ బాగానే స్వామి భక్తి ప్రదర్శిస్తోందని, ఇదే తరహాలో తిడుతూ పోతే పరిణామాలు అదుపు తప్పుతాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
తమ అధినేత జగన్ పై ప్రేమ ప్రదర్శించడం అన్నది తప్పేమీ కాదని, అదే సమయంలో ఇతర పక్షాలను తిట్టడం అన్నది కూడా సంయమనం పాటించకుండా మాట్లాడడం కూడా సబబు కాదని విశ్లేషకులు అంటున్నారు. దిగజారే భాషకు ఎవరు ప్రాధాన్యం ఇచ్చినా అది సమర్థనీయం కాదన్న విషయం పొలిటికల్ పార్టీలు తెలుసుకోలేనంత కాలం తిట్లు తీవ్ర స్థాయిలో వినపడుతూనే ఉంటాయి.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ నాయకులు అప్రమత్తం అయ్యారు. తమ నాయకుడ్ని టీడీపీ నాయకులు తిట్టిపోయడంపై మండి పడుతూ జిల్లా కేంద్రాలలో జనాగ్రహ దీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ పై స్వామి భక్తిని నిరూపిం చుకునేందు అదుపు తప్పి మాట్లాడుతున్నారు. నిన్నటి వేళ రోజా మళ్లీ తన నోటికి పని చెప్పారు. తనదైన శైలిలో చంద్రబాబును, ఆయన కొడుకును తిట్టిపోశారు. ఇలా తిట్టుకుంటూ పోతే వీటికి అడ్డూ అదుపూ లేకుండా పోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందని? తమ అధినేత దగ్గర మార్కులు కొట్టేయాలన్న ఆలోచనతో కొందరు మరీ ఎక్కువగా చంద్రబాబును టార్గెట్ చేసుకుని పాత గొడవలన్నీ తవ్వి తీసి మాట్లాడడంతో తీవ్ర పరిణామాలు అన్నవి మున్ముందు చోటు చేసుకోక తప్పవు. ఇప్పటికే తాము ఎవ్వరినీ వదలమని లోకేశ్ చెబుతున్నారు. అన్నింటినీ గుర్తు పెట్టుకుంటామని రేపటి వేళ తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా అన్నింటికీ బదులు ఇస్తామని ప్రతికారేచ్ఛ అన్నది తప్పదని కూడా స్పష్టం చేస్తున్నారు వైసీపీ నాయకులు.