బండి పాదయాత్ర విజయ తీరానికి బాట అవుతుందా..?
బండి సంజయ్ పాదయాత్ర రోజుకు రెండు మూడు గ్రామాల గుండా సాగుతోంది. అక్కడ గ్రామస్తులతో మాట్లాడి.. అక్కడి ప్రజలకు ప్రభుత్వం అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలు, అధికార దుర్వినియోగం, ఫాం హౌజ్ పాలన, కుటుంబ రాజకీయం పై ప్రజలకు వివరిస్తున్నారు. అందని పథకాలు, ఇంకా దళితబంధు భవిష్యత్లో ఎలా ఉంటుంది. వచ్చిన డబ్బుతో అనుభవం లేని వ్యాపారం చేసి నష్టపోతే.. మళ్లీ పది లక్షలు ఇస్తారా అనే ప్రశ్నను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు బీసీలకు కూడా ఓ బంధు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు కేసీఆర్ చేస్తున్న పనులను, కళ్లబొల్లి మాటలను సోషల్ మీడియా ముఖంగా పోస్టులు చేస్తున్నారే తప్ప ప్రజల్లోకి వెళ్లి వారికి చేరువయ్యే విధంగా ఎవరూ విడమరిచి చెప్పడం లేదు. దీంతో ఇప్పుడు బండి పాదయాత్రతో ఆ పని చేస్తున్నారు. దీంతో అధికార పార్టీకి మింగుడు పడడం లేదు. ఇలా పాదయాత్రలో అనేక మంది బీజేపీలో చేరుతున్నారు. తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసే సరికి లక్షల్లో బీజేపీ సైనికులుగా మారుతారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తందని అంచనా వేస్తున్నారు. బీజేపీ అధిష్టానం ఆలోచనతో సాగుతున్న ఈ ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా తాము అధికారం చేపడుతామని, రాబోయే రోజుల్లో తెలంగాణ ఘడీల పాలన నుంచి విముక్తి చెందుతుందని నాయకులు పాదయాత్ర సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.