ఎట్టకేలకు ఏపీ సీఎం అపాయింట్మెంట్!
గతంలో కూడా ఓ సారి మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగార్జున, నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు, దర్శకుడు రాజమౌళి, వంటి పలువురు ప్రముఖులు జగన్ తో భేటీ అయ్యారు. సైరా నరసింహారెడ్డి విడుదల సందర్భంగా చిరంజీవి సతీసమేతంగా జగన్ను కలిశారు. ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్తో థియేటర్లు మళ్లీ మూత పడ్డాయి. ఇప్పటికీ ఏపీలో మూడు షోలు మాత్రమే వేస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి కర్ఫ్యూ అమలవుతున్నందున నాలుగో షోకి అనుమతి లేదు. తాజాగా ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ లో విక్రయించేందుకు వెబ్ సైట్ ను ఏర్పాటు చేయాలని.. సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ కమిటీని కూడా నియమించింది. ఈ నిర్ణయం పరిశ్రమ వర్గాలలో కలకలం రేకెత్తించింది. ఈ సమస్యలపై చర్చించేందుకు.. ఏపీ సీఎంను కలవాలని సినీ నటుల బృందం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తోంది. అపాయింట్మెంట్ దక్కకపోవడంతో సమాచారశాఖ మంత్రి పేర్ని నానితో ఇండస్ట్రీ పెద్దలు సీఎంకు రాయబారం పంపారు. ఆ రాయబారం పంపిన నెల రోజుల తర్వాత ఎట్టకేలకు అపాయింట్మెంట్ దొరికింది. ఈనెల 20వ తేదీన టాలీవుడ్ బృందం సీఎం జగన్తో భేటీ కానుంది. అయితే ఈ భేటీని అధికార వర్గాలు ఇంకా దృవీకరించాల్సి ఉంది.