ఏ పథకం అయినా, ఆర్థిక లావాదేవీలు అయిన ఆధార్ కార్డు నంబర్తో అనుసంధానం చేయడం తప్పనిసరి. ఒక్క ఆధార్ నంబర్తో ఆ వ్యక్తికి సంబంధించిన ఆస్తిపాస్తులు, విద్యా ఉద్యగం వంటి ఇతర వివరాలు తెలిసిపోతాయి. అలాగే ఆధార్ తరహాలో కొత్తగా హెల్త్ ఐడీ కార్డును జారీ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఒకే దేశం ఒకే ఐడీని తీసుకువచ్చిన కేంద్రం ఆరోగ్య పరిరక్షణ కోసం విశ్వజనీన హెల్త్ కార్డులు ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ హెల్త్ కార్డు ద్వారా ప్రజలు ఇక ముందు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, నగరానికి వెళ్లినప్పుడు వారి వెంట హెల్త్ రికార్డులు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆ కార్డు చూపిస్తే ఇంతకముందు నిర్వహించిన వైద్య పరీక్షల రిపోర్టుల వివరాలు ఉంటాయి. వీటి ఆధారంగా వైద్య చికిత్స చేయొచ్చు.
ఈ నెల చివరిలో జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్ (ఎన్డీహెచ్ఎం)ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారని వార్తలొచ్చాయి. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రులు, వైద్యులు, ల్యాబ్స్, కెమిస్ట్ల సమాచారం మొత్తం రికార్డ్ చేసి ఉంచుతారు. గతేడాది ఈ ప్రాజెక్టును కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, డామన్ దీవి, లడఖ్, లక్షద్వీప్ల్లో ప్రయోగాత్మకంగా కేంద్రం చేపట్టింది. ఈ ప్రాంతాల ప్రజలకు విశ్వజనీన హెల్త్ కార్డుల పంపిణీ చేయడం ప్రారంభించారు. తదుపరి దశలో ఈ స్కీమ్ దేశమంతా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందని సమాచారం.
ఈ స్కీమ్ ప్రకటించిన వెంటనే గూగుల్ ప్లే స్టోర్లో ఎన్డీహెచ్ఎం (పీహెచ్ఆర్ అప్లికేషన్) అందుబాటులోకి తీసుకువస్తారు. దీని ద్వారా ప్రజలంతా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. విశ్వజనీన ఐడీ 14 డిజిట్స్తో ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు లేని వారికి ప్రభుత్వ-ప్రైవేట్ దవాఖానలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, వెల్నెస్ సెంటర్లు, కామన్ సర్వీస్ సెంటర్ల వద్ద వివరాలు నమోదు చేస్తారు. ఇందులో పేరు, జనన తేదీ, మొబైల్ ఫోన్ వివరాలు ఎంటర్ చేస్తారు.