రేవంత్ సేఫ్ : ఫిర్యాదులు పట్టించుకోని రాహుల్ !
దీక్షలు బాగున్నాయని టాక్
వరుస దీక్షలు, ధర్నాలు అన్నవి ఇంతకాలం లేవు కనుక పార్టీకో జోష్ తీసుకువచ్చాడని కొత్త బాస్ విషయమై చాలా మంది రాహుల్ కు చెప్పారు. అదేవిధంగా కేసీఆర్ పై చూపిస్తున్న దూకుడు ఓ విధంగా సాహసమేనని, కేసులు, కుట్రలు అన్నవి ఉంటాయని, వాటికి భయపడకుండా తన పని తాను చేసుకోవడంలో ఆయన విజయవంతం అయ్యాడని ఇంకొందరు అధిష్టానం ఎదుట గళం విప్పారని కూడా సమాచారం. టీపీసీసీ బాస్ పనితీరు బాగుందన్నది ఓ వర్గం ప్రశంస కూడా! ఇవన్నీ ఉన్నప్పుడు పదవిని భారం అనుకోక బాధ్యతగా నిర్వర్తిస్తున్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం అప్పటిలా
చెప్పుడు మాటలు వినేందుకు అయితే సిద్ధంగా లేదన్నది వాస్తవం.
ఇంకా చెప్పాలంటే...
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పగ్గాలు అందుకున్నాక పార్టీ తీసుకునే చర్యలలో వేగం పెరిగింది. పార్టీ పనులలో వేగం పెరిగింది. అదే విధంగా ఇతర పార్టీల నేతలు, కాంగ్రెస్ ను వీడిపోయిన నేతలు సైతం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. ఈ దిశగా వారు పార్టీలో చేరేందుకు అడుగులు వేస్తున్నారు. కొందరు అసంతృప్తులను సైతం రేవంత్ పిలిచి మాట్లాడి, తన దారిలోకి తెచ్చుకుంటున్నారు. కొందరు బాహాటంగా విమర్శలు చేస్తూ ఉన్నా అవన్నీ పట్టించుకోవడం లేదు. పార్టీ బలోపేతమే ధ్యేయంగా రేవంత్ పనిచేస్తుండడంతో అధిష్టానం దగ్గర మంచి మార్కులే కొట్టేశాడు. రాష్ట్ర వ్యవహారాలు చూస్తున్న మాణిక్యం ఠాగూర్ కూడా రేవంత్ కు మద్దతుగానే ఉన్నారు. ఆయన కూడా నివేదిక ఒకటి తెప్పించి, రాష్ట్ర పరిణామాలపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారని సమాచారం.