తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా.? అనే ప్రశ్నకు కేటీఆర్ మాటలు ఊతమిస్తున్నట్టుగా కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తలకు అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం కావాలని, పార్టీ కార్యకర్తలకు ఉత్తేజం కలిగిస్తూ సంస్థాగత నిర్మాణం దిశగా చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా అనే అనుమానాలు కలుగక మానదు. నిజానికి అధికార టీఆర్ఎస్ పార్టీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంకేతాలను ప్రజలకు, ఇటు ప్రతి పక్షాలకు ఇస్తూ మెంటల్ గా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది.
గతంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పాగా వేయాలని నిర్ణయించుకుని ప్రతిపక్షాలకు ఎలాంటి చాన్సు, సమయం ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడు, పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని సీఎం కేసీఆర్ ముందస్తూ ఎన్నికలకు వెళ్లారని చెబుతారు. అలాగే ఇప్పుడు కేసీఆర్ వేస్తున్న ప్రణాళికలు చూస్తుంటే ఈ సారి మళ్లీ అదే రిపీట్ అవుతుందనే ప్రచారం నడుస్తోంది. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ భవనాన్ని నిర్మించి, కేటీఆర్ను సీఎంగా ప్రకటించి ఢిల్లీపైనే సీఎం కేసీఆర్ ఫోకస్ చేయనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడిన తీరు ఆసక్తి రేపుతోంది.
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. దీంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలని సైన్యం ఉంటే సరిపోదు సైన్యాధ్యక్షులు కూడా ఉండాలని కేటీఆర్ చెప్పారు. అదే విధంగా ప్రతిపక్షాల మాటలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని, సోషల్ మీడియా కమిటీలు నియమించాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. అయితే, ఎన్నికలకు ఇంకా సమయం ఉందని ఇప్పుడే ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవడంపై రాజకీయ విశ్లేషకులు దృష్టి సారించారు. పోయిన సారి ఆరు నెలల ముందే ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ ఇప్పుడు ఏడాది ముందుగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.