అవును అవును పెద్దయ్య ! : సీఎం అంటే భయమే లేదు?
|
భారీ వర్షాలకు రోడ్లు ఇళ్లూ ఒక్కటయిపోయాయి. కుండపోత వానలకు కొన్ని చోట్ల ఇళ్లన్నీ జలమయం అయిపోయి, బాధితుల ఆ ర్తనాదాలకు అంతే లేకుండా పోయింది. ఇన్ని జరిగినా, ఇంత విలయం ఒకటి కళ్లెదుటే ఉన్నా కనీస స్థాయి చర్యలు లేకపోవడం తో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కేసీఆర్ మాత్రం ఢిల్లీ నుంచే ఆదేశాలు ఇస్తున్నారు కానీ వాటిని స్వయానా ఆయన పుత్రరత్నం కూడా పాటించడం లేదు అన్నది విమర్శ. బాధ్యత గల లీడర్లు ఈ సమయంలో తమవంతు సహాయక చర్యలకు పూనుకుని కాస్తయినా ఊరటనివ్వాలి. బాధిత ప్రాంతాలలో భోజన ఏర్పాటు చేయాలి. వైద్య సాయం కోరితే వెంటనే వారిని ఆదుకోవాలి. ఇవేవీ లేకుండా కేవలం రాజకీయాలకు మాత్రమే రాజకీయ నాయకులు పరిమితం కావడమే ఇవాళ్టి విచారం. విషాదం కూడా!
కేసీఆర్ అంటే భయం లేదు అని చెప్పడం ఈ వార్త ఉద్దేశం మాత్రమే కాదు ఇవాళ ప్రజలు తీవ్ర కష్టాలలో ఉన్నప్పుడు స్పందించాల్సి న నాయకులు ఇళ్లకే పరిమితం అయిపోవడం అన్నదే బాధాకరం. సిరిసిల్ల, కరీంనగర్, ఆదిలాబాద్, మూలుగు తదితర ప్రాంతాలు అన్నీ జలమయం అయిపోయాయి. తిండన్నది లేకుండా ప్రజలు ఆకలి దప్పులతో బాధపడుతున్నారు. అయినప్పటికీ గులాబీ పార్టీ శ్రేణులు కానీ, ఇతర అధికారులు కానీ క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన చర్యలు చేపట్టడం లేదు. మౌనం వహిస్తున్నారు. బాధిత ప్రాంతాలలో పర్యటించడం లేదు. ఇంతవరకూ సిరిసిల్లకు మంత్రి కేటీఆర్ వెళ్లనే లేదు. కేవలం టెలిఫోన్ సంభాషణలతోనే కాలం వెళ్లదీయడం ఎంత వరకూ సమంజసమో ఎవరికి వారు ఆలోచించుకుని, తక్షణ కార్యాచరణకు పూనిక వహించాలి.