గులాబీ వనంలో : కొంచెం ఇష్టం ? కొంచె కష్టం ?
కేసీఆర్ స్పందిస్తారు
సాయం అందిస్తారు
కానీ అధికారుల పరుగులు అలా లేవు ?
అలా కేసీఆర్ పరంగా ఇష్టం
యంత్రాంగం సజావుగా నడవడం అంటే కష్టం..
మహిళా రైతు తల్లి లాంటి నేలను వదిలిపోయారు
ఆత్మ హత్య చేసుకుని బిడ్డలను అనాథలు చేయడం
తగని పని కానీ పంట నష్టాలే అందుకు కారణం
ఉసురు తీసిన పంట కారణంగా ఆ కుటుంబం రోడ్డున పడింది
ఇద్దరు కుమారులు ఏం చేయాలో తోచని స్థితిలో తమ సమస్యను కేటీఆర్ కు చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో చెప్పారు. ఫలి తం వారికి అందాల్సిన ఆరు లక్షలు త్వరలోనే అందుతాయి. సత్వర న్యాయం పరిహారం అన్నవి దక్కక పోయినా వారికి ఇప్పటి కైనా ఆర్థిక చేయూత దక్కింది.
రైతు మా దేవుడు అని చెప్పడం సులువు.. రైతుకే మా రాజ్యం అంకితం అని చెప్పడం ఇంకా సులువు.. ఓ మహిళా రైతు కుటుం బాన్ని ఆదుకోవడంలో చేసిన జాప్యం మాత్రం ఎంత మాత్రం అంగీకరించదగ్గది కాదు. అయినప్పటికీ కాస్తలో కాస్త మినహాయింపు ఇవాళ ఆ కుటుంబాన్ని కేసీఆర్ సర్కార్ ఆదుకోవడం. ఇందుకు కేటీఆర్ తనవంతు సాయం చేయడం.. వ్యవసాయ అధికారులను కలవమని సామాజిక మాధ్యమాల వేదికగా బాధిత కుటుంబ సభ్యులకు చెప్పడం.. ఇంతకూ ఏం జరిగింది?
సూర్యాపేట కు చెందిన మహిళా రైతు కథలో కన్నీటి వ్యథలే ఉన్నాయి. ఇద్దరు బిడ్డలున్న ఆ తల్లి పంట నష్టాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఆ ఇద్దరూ తల్లిలేని బిడ్డలయ్యారు. నాన్నకు మతి స్థిమితం లేదు. ఏం చెప్పాలో వారికి తెలియనే లేదు.
పంట పోతే ఓ బాధ.. అమ్మ పోతే ఓ బాధ.. నేల తల్లి నమ్ముకున్న బిడ్డలు వారు.. ఒకరి వయస్సు 12 ఏళ్లు మరొకరి వయస్సు 10 ఏళ్లు.. మహేశ్ , మనీశ్ ఇద్దరూ పాపం ఏం చేయాలో తోచక అవస్థపడుతున్నారు. తాతకు కంటి చూపు లేదు. అమ్మ చనిపోయాక ఇంటికి ఆధారమే లేదు. ఈ క్రమంలో కేటీఆర్ ను సామాజిక మాధ్యమాల్లో వేడుకున్నారు. నా దృష్టికి మీ సమస్య తెచ్చారు. ధన్యవాదాలు మీరు వెంటనే వ్యవసాయ అధికారులను కలవండి అని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ఆ అన్నదమ్ములు ఆనందం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా తమకు దక్కని న్యాయం పరిహారం ఇవాళ కేటీఆర్ స్పందన కారణంగా దక్కడం సంతోషంగా ఉందనంటున్నారు.