చంద్రబాబు నినాదం అందుకున్న పవన్...?

Sahithya
అడుగుకో గుంత... గజానికో గొయ్యి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసారు. రోడ్ల సమస్యపై మాట్లాడిన పవన్ కళ్యాణ్... వైసీపీ పాలనలో ఏపీ రహదారుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. రోడ్డు బాగు చేయమంటే వేధింపులు... లాఠీ ఛార్జీలు... అరెస్టులు అంటూ ఆయన ఆరోపించారు. పాడైన రోడ్లను #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో చూపిద్దాం అని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో గాంధీ జయంతి రోజున శ్రమదానంతో రోడ్లను బాగు చేద్దాం అన్నారు పవన్.
ఒక దేశం కానీ, రాష్ట్రం కానీ, ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే అక్కడ రహదారుల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మిస్తూ, రోడ్ల వ్యవస్థను పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే.. వైసీపీ పాలనలో ఏపీ రోడ్ల వ్యవస్థ అడుగుకో గుంత... గజానికో గొయ్యిలా ఉంది అన్నారు ఆయన. ఇవి సరదాకు చేస్తున్న రాజకీయ విమర్శలు కాదు అని పేర్కొన్న పవన్...  నివర్ తుపాన్ సమయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించినప్పుడు ప్రత్యక్షంగా దెబ్బ తిన్న రోడ్లను చూశాను అన్నారు ఆయన.
రోడ్ల గురించి అడిగితే బెదిరింపులకు దిగుతున్నారు అని పోలీసులతో లాఠీ ఛార్జీలు  చేయించే పరిస్థితులు ఉన్నాయి అని పవన్ తెలిపారు. ఒక్క నెల్లూరు జిల్లానే కాదు పామర్రు, గుడివాడ వెళ్లినప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపించింది అని ఆయన విమర్శలు చేసారు.  భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డు గానీ, అనంతపురం నుంచి తాడిప్రతి వెళ్లే రోడ్డు... ఏ రోడ్డు తీసుకున్న చాలా అధ్వాన్నంగా తయారయ్యాయి అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో దాదాపు లక్షా 20వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు ఉన్నాయి అన్నారు. ఈ రోడ్లు దెబ్బ తిన్నా బాగు చేయడం లేదు అని మండిపడ్డారు. వీటిని చూసైనా ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 2వ తేదీన మన రోడ్లను మనమే “శ్రమదానం” చేసి బాగు చేసుకుందాం అన్నారు.  రోడ్లను బాగు చేసే శ్రమదానం కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని అవుతాను అన్నారు పవన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: