రోజాకు సేమ్ సీన్ రిపీట్...మళ్ళీ అవకాశం లేదా?
గతంలో టీడీపీ తరుపున రెండుసార్లు పోటీ చేసి ఓటమి పాలైన రోజా, ఆ తర్వాత వరుసగా వైసీపీ తరుపున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచేశారు. అయితే టీడీపీలో ఉన్నప్పుడు కూడా రోజా ఫైర్ బ్రాండ్గా ఉన్నారు. అప్పుడు ప్రత్యర్ధులపై అదే రేంజ్లో ఫైర్ అయ్యేవారు. కాకపోతే టీడీపీలో రెండుసార్లు ఓటమి పాలు కావడం, తనని సొంత పార్టీ వాళ్లే ఓడించారనే అసంతృప్తితో రోజా టీడీపీకి దూరమయ్యారు. ఆ తర్వాత జగన్ పెట్టిన వైసీపీలోకి వచ్చి గత రెండు పర్యాయాలు నగరి నుంచి గెలిచారు.
అయితే ఇప్పుడు వైసీపీలో కూడా కొందరు నాయకులు రోజాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. నగరిలో సెపరేట్గా మరో గ్రూపు రాజకీయం చేస్తుందని, దీనిపై ఇప్పటికే ఆమె పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అలాగే చిత్తూరు జిల్లాలో ఉండే మంత్రులు రోజాకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని కథనాలు కూడా వస్తున్నాయి. అయితే ఈ గ్రూపు రాజకీయాలే రోజాకు ఇబ్బంది అవుతున్నాయని తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో రోజాని కాదని జగన్ మరొకరికి సీటు ఇవ్వడం కష్టం. అయితే నగరిలో రోజా మళ్ళీ బరిలో దిగితే సొంత పార్టీ నేతలు, ఆమె గెలుపు కోసం ఏ మేర కృషి చేస్తారనేది అనుమానంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమెని పరోక్షంగా దెబ్బకొట్టడానికి రాజకీయం చేసే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో నగరిలో రాజకీయం ఎలా ఉంటుందో?