తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. నీళ్లు , నిధులు , నియామకాలను కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కి తాకట్టు పెట్టారంటూ ఆరోపించారు. 2015 జూన్ నెలలో మొదటిసారి జరిగిన సమావేశంలో తెలంగాణ సలహాదారు విద్యాసాగర్ , హరీష్ రావు లు అంగీకారం తెలిపిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశం లో 2016 సెప్టెంబర్21 న కేసీఆర్ , చంద్రబాబు లు నీటి వాటాపై మాట్లాడుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. 299 టిఎంసీ ల నీళ్లు తెలంగాణ కు, 512ఆంధ్రప్రదేశ్ కు అంటూ ఆనాడు కేటాయింపులు చేసుకున్న మాట వాస్తవం కాదా? అని సంజయ్ ప్రశ్నించారు.
మొత్తం 811 టీఎంసీ లలో 575 టీఎంసీల నీళ్లు తెలంగాణ కు రావాలని 12.5.2020 న రజత్ కుమార్ లేఖ రాసారని తెలిపారు.
అప్పటి కౌన్సిల్ సమావేశంలో తెలంగాణకు అన్యాయం జరిగేలా ముందుగా ఒప్పుకుందే సీఎం కేసీఆర్ అంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్ళినప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య రహస్య ఒప్పందం జరిగిందంటూ సంజయ్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. 203 జీవో మే5 న జారీ చేస్తే మొదట స్పందించింది తామేనని అన్నారు. మే 11 న 2020 లో కేంద్ర జలశక్తి మంత్రికి తాను లేఖ రాసినట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలపై మే 12 న ముఖ్యమంత్రి కేసీఆర్... సీఎస్ తో లేఖ రాయించారని చెప్పారు. తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర జలశక్తి కేఆర్ఎంబిని ఏపీ ప్రాజెక్టు ల నిర్మాణం ఆపేలా చూడాలా కోరిందని సంజయ్ తెలిపారు.
ఈ ఏడేళ్ల వ్యవధిలో ముఖ్యమంత్రి చేసిన కార్యక్రమాలపై షెడ్యూల్ విడుదల చేస్తారా..? అంటూ సంజయ్ ప్రశ్నించారు. మే నెల మొత్తం లేఖల ద్వారా హెచ్చరించినా ఆగస్టు లో పనులు జరుగుతున్నాయని తెలిసి కూడా సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. నీటి కేటాయింపుల విషయం లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తో జరిగిన ఒప్పందం తప్పని నిరూపిస్తే తాను శ్రీశైలం ప్రాజెక్టు లో పడి చచ్చిపోతానంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కానీ నిజమైతే నువ్వు ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు.