లాక్ డౌన్.. ఢమాల్!

Chaganti
భారతదేశ వ్యాప్తంగా అనేక కాక ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఇంకా తన ఉధృతి కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతానికి భారతదేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. దాదాపుగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్లోకి వెళ్ళిపోగా ఇప్పుడిప్పుడే సడలింపులు ఇస్తూ మళ్లీ అన్లాక్ ప్రక్రియ మొదలైంది. అయితే తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన నగరాలు పట్టణాల్లో బార్ అండ్ రెస్టారెంట్ ల పరిస్థితి మరీ దారుణంగా మారింది.

ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉదయం ఆరు గంటల నుంచి 12 గంటల వరకు తెలంగాణలో ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంట వరకు లాక్ డౌన్ సడలింపులు ఇచ్చారు.. వైన్స్ పరిస్థితి కాస్తలో కాస్త మెరుగైనా, బార్ అండ్ రెస్టారెంట్ కి ఎవరూ వెళ్ళని పరిస్థితి నెలకొంది.. సాధారణ రోజుల్లో తెల్లవారితే చాలు బార్ లో ప్రత్యక్షమయ్యే వారు సైతం ఇప్పుడు ఎందుకు వచ్చిన తలనొప్పి అని వైన్స్ లో మందు కొనుక్కొని ఇంట్లోనే కూర్చుని తాగుతున్న పరిస్థితి. దీంతో సాధారణంగా వీకెండ్ బిజినెస్ ఏ కాక రోజువారీ బిజినెస్ కూడా లేక భారీగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే మొన్న ఈ మధ్యన కరోనా లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతూ గ్రేటర్ హైదరాబాద్ బార్ అండ్ రెస్టారెంట్ అసొసియేషన్ సభ్యులు ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు.

లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన టైంలో తమకు వ్యాపారం జరగడం లేదని ఈ క్రమంలో భారీగా నష్టపోతున్నామంటూ వారంతా ఎక్సైజ్ కమిషనర్ కు లేఖ రాశారు. గతేడాది నుంచి కరోనాతో బిజినెస్ లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని అప్పులు చేసి లైసెన్స్ ఫీజులు కట్టామని అయితే ఈ ఏడాది పరిస్థితి కాస్త బాగుపడుతుందని భావిస్తే ఇప్పుడు  మళ్లీ లాక్ డౌన్ కారణంగా బార్లు ఓపెన్ చేసే పరిస్థితి లేదని ఈ ఏడాది లైసెన్స్ ఫీజును రద్దు చేయాలని కూడా వారు కోరారు. అయితే హైదరాబాదు వాళ్లు నోరు తెరిచి లేఖ రాశారు కానీ దాదాపు తెలుగు రాష్ట్రాల్లో మిగతా చోట్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. మరి ప్రభుత్వం వారికి ఏదో ఒక రకంగా ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే వాళ్ళు అన్నట్లు నిజంగానే ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: