రేసులోకి జోగి...ముగ్గురులో చెక్ పడేది ఎవరికో?
అందులో ఛాన్స్ కొట్టేయాలని వైసీపీ ఎమ్మెల్యేలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ సైతం మంత్రి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రమేష్ దూకుడుగానే రాజకీయాలు చేస్తుంటారు. ప్రతిపక్షానికి చెక్ పెట్టడంలో ముందుంటారు. అయితే కొన్ని సమీకరణల్లో భాగంగా రమేష్కు మొదటివిడతలో పదవి రాలేదు. అయితే రెండో విడతలో ఛాన్స్ కొట్టేయాలని జోగి చూస్తున్నారు.
అందుకే తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సైతం జోగి చెలరేగిపోయారు. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై బూతుల వర్షం కురిపించారు. ఇలా అసెంబ్లీలోనే బూతులు మాట్లాడి హైలైట్ అయిపోయారు. అలాగే జగన్ దృష్టిలో కూడా పడ్డారు. ఇలా అసెంబ్లీలోనే దారుణమైన మాటలు మాట్లాడినా సరే జగన్ సైతం రమేష్ని మందలించే ప్రయత్నం చేయలేదు. కాకపోతే తప్పు చేశానని ఒప్పుకోవడాన్ని ప్రశంసించారు.
ఏదేమైనా జోగి అయితే జగన్ దృష్టిలో పడ్డారు. కాకపోతే జోగికి కేబినెట్లో చోటు దక్కాలంటే చాలా తతంగం జరగాలి. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్లు కేబినెట్లో ఉన్నారు. వీరిలో ఎవరోకరిని తప్పిస్తేనే గాని జోగి లైన్ క్లియర్ అవ్వదు. దానికి తోడు జోగి సామాజికవర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాల్ మంత్రిగా ఉన్నారు. ఇటు కృష్ణా జిల్లాలో జోగితో పాటు మరికొందరు సీనియర్లు ఎమ్మెల్యేలు, మంత్రి పదవి ఆశిస్తున్నారు. మరి ఈ ఇబ్బందులన్నీ తొలగి జోగికి పదవి దక్కుతుందో లేదో చూడాలి.