చంద్రబాబుకు బిగ్ షాక్.. పార్టీ పదవికి కీలక నేత రాజీనామా
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పుట్టగతులు లేకుండా పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ జ్యోతిని ఆర్పేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని చెప్పారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించారని పేర్కొన్నారు. ఓటమికి భయపడేవాడు రాజకీయ నాయకుడు కాదని అన్నారు. ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను.. ప్రారంభిస్తే తప్పేంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. నిమ్మగడ్డ ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఎందుకు అడగలేదని నిలదీశారు. చంద్రబాబు ఏనాడూ ఒంటరిగా అధికారంలోకి రాలేదని గుర్తుచేశారు.
రేపు అసెంబ్లీ, పార్లమెంట్కు కూడా అభ్యర్థులు దొరకరని చంద్రబాబు త్వరలో పార్టీని కూడా రద్దు చేస్తారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. నువ్వు రాజకీయ నాయకుడివి కాదు.. పిరికివాడివి అంటూ మండిపడ్డారు. తిరుపతిలో కూడా పోటీ విరమించుకుంటారా అని ప్రశ్నించారు. వెన్నుపోటు ద్వారా రాజ్యాధికారం సాధించారు.. ఎన్నికలకు వెళ్లినా.. గెలిచేటట్టు లేదు చంద్రబాబుకు తెలిసే ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు అని అంబటి రాంబాబు అన్నారు.